వీసీని తొలగించాలి
ఉత్తరాంధ్ర విద్యార్థి సేన
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : జేఎన్టీయూ గురజాడ విజయనగరం యూనివర్సిటీ వైస్ చాన్సులర్
(వీసి) అవినీతి,అక్రమాలపై న్యాయ విచారణ జరిపించి, ఆ వీసీని విధుల నుంచి తక్షణమే తొలగించాలని ఉత్తరాంధ్ర విద్యార్ధి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి డిమాండ్ చేశారు. నగరంలో ఓ హోటల్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విసి అవినీతి అక్రమాల చిట్టాను వెల్లడించారు.దేశంలో ఎంతో విశిష్టత కలిగిన విశ్వవిద్యాలయాల్లో జేఎన్టీయూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఒకటని, అటువంటి ప్రఖ్యాతి యూనివర్సిటీని భ్రస్ట్ పట్టించేలా వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటసుబ్బయ్య వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ వీరాభిమానిగా మెలిగే వెంకటసుబ్బయ్యను ఇక్కడ యూనివర్సిటీ విసీగా నియమించడంతో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన జేఎన్టీయూ యూనివర్సిటీ ఖ్యాతి మసక భారే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో కనీస వసతులు కల్పించాలని, మరో 29 ఇతర సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు ఈ ఏడాది జనవరిలో ఆందోళన చేసిన నేటికీ ఒక్క సమస్య కూడా పరిష్కరించబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.యూనివర్సిటీలో 20 కోట్ల రూపాయలతో చేస్తున్న భవన నిర్మాణ పనులలో కనీస నాణ్యత, ప్రమాణాలను పాటించకుండా, క్వాలిటీ కంట్రోల్ తనిఖీ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి, ఆ నిధుల నుంచి సుమారు రెండున్నర కోట్ల రూపాయలు విసీ స్వాహ చేశాడని, తన ఆగడాలను ప్రశ్నిస్తున్న రిజిస్ట్రార్ ను తొలగించి, తనకు వత్తాసు పలికే రిజిస్టార్ ను నియమించుకున్నారని మండిపడ్డారు.తన అక్రమాలు బయట పడతాయని ఈ ఆఫీసు విధానానికి స్వస్తిపలికారని తెలిపారు. పరీక్ష ఫలితాలు సకాలంలో వెల్లడించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పరీక్షలకు హాజరుకాని విద్యార్థులను పాస్ అయినట్లు, మంచి మార్కులతో పాస్ అవుతామనుకున్న విద్యార్థులను ఫెయిలవుతున్నట్లు వెల్లడించి విద్యార్థులను మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక లక్ష దాటి కొనుగోలు చేసే ప్రతి వస్తువు ఈ ప్రోక్యుమెంట్ ద్వారా కొనాల్సి ఉన్నప్పటికీ ఓ ప్రైవేటు కంపెనీతో ఎంఓయూ చేసుకొని యూనివర్సిటీ నిధులను స్వాహా చేస్తున్నారని పేర్కొన్నారు. యూనివర్సిటీలో పనిచేసే కొంత మంది సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ సిబ్బంది నుంచి వీసి డబ్బులను డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వలేని ఉద్యోగులను విధుల నుంచి తొలగించడంతో ఆ ఉద్యోగులంతా ఆనాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యాశాఖ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లిన కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు తనకు నచ్చిన వారికి యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా చేర్చుకొని వారి సహకారంతో అర్హత లేని వారికి పదోన్నతలు కల్పిస్తున్నారని, యూనివర్సిటీ పరిధిలో గల ప్రైవేట్ కళాశాల నుండి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారని, ఉద్యోగం ఇక్కడ చేస్తూ విశాఖలో నివాసం ఉంటూ విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోతున్నారని ఆరోపించారు. విసీ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా అధికారి పాలనా బాధ్యతల నుండి తప్పుకొని జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర విద్యార్థి సేన విశాఖ జిల్లా అధ్యక్షుడు కంటుమల్లెడ్డి సూర్యనారాయణ, విజయనగరం జిల్లా అధ్యక్షుడు విసినగిరి నాగరాజు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ముల్లు మహేష్, వీసీ బాధితులు రవీంద్ర కుమార్ సింగ్, సనపతి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.