ఇసుక పాలసీపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హర్షం
విశాలాంధ్ర – అనంతపురం : గత ఐదేళ్లలో పేదలు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ధరలు చూసి భయపడే పరిస్థితి ఉందని.. ఇకనుంచి ఆ భయం అవసరం లేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీపైన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నెలరోజుల్లోపే ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేశారని ఆయన సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, పారదర్శకత, ముందుచూపుతో ఇసుక పాలసీని రూపొందించడం జరిగిందన్నారు. దీనిపై అనునిత్యం ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని దగ్గుపాటి అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తామన్నారు. గత ఐదేళ్లలో ఇసుక దోపిడీదారుల రాజ్యం కొనసాగిందన్నారు. పేదలకు ఇసుక అందకుండా వైసిపి ఎమ్మెల్యేలే బెంగళూరు వంటి నగరాలకు అక్రమంగా తరలిస్తూ వందల కోట్లు అర్జించారని విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపి.. ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే రూ. 50 వేల కోట్లకు పైగా కొల్లగొట్టారని.. కచ్చితంగా దీనిపై విచారణ జరుగుతుందని ఆయన అన్నారు. ఇసుక అక్రమంగా ఎవరైనా తరలిస్తే… ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలోని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తాజా ఇసుక పాలసీ వల్ల భవనిర్మాణరంగానికి పూర్వవైవం వస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆశా భావన వ్యక్తం చేశారు.