బర్ధన్ జయంతి సభలో నేతల ఘననివాళి
విశాలాంధ్ర-హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారమే ఊపిరిగా కడవరకు ఉద్యమించిన మహానేత ఏబీ బర్ధన్ అని సీపీఐ జిల్లా కార్యదర్శి బీ బాలకిషన్ అన్నారు. సురవరం వెంకట్రామ్రెడ్డి భవన్లోని సీపీఐ కార్యాలయంలో బుధవారం పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ శత జయంతి సభ జరిగింది. పలువురు ప్రముఖులు బర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలకిషన్ మాట్లాడుతూ 1924 సెప్టెంబరు 25న బర్ధన్ జన్మించారన్నారు. తండ్రి ఉద్యోగిరీత్యా నాగపూర్లో స్థిరపడ్డారు. 15 సంవత్సరాలకే కమ్యూనిస్టు భావాలని పుణికి పుచ్చుకున్నారు. 1940లో నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఎఫ్ లో ప్రవేశించి వర్సిటీలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో పీసీ శుక్లపై గెలుపొందారు. అదే ఏడాది గుంటూరులో జరిగిన సంఘ మహాసభలో కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించారన్నారు. 1948 నుంచి రెండు సంవత్సరాలు అజ్ఞాత జీవితంగడిపారు. తన రాజకీయ జీవితంలో 20 సార్లు అరెస్టయి నాలుగేళ్లు జైలు జీవితం గడిపారన్నారు. ప్రత్యక్ష రాజకీ యాల్లోకి వచ్చి 1957 మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో నాగపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 1990లో సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా ఎది గారు. చంద్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో బర్ధన్ కేంద్ర కార్యదర్శివర్గంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఇంద్రజిత్ గుప్త జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు ఉప ప్రధాన కార్యదర్శిగా… 1996 యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో సీపీఐ చేరడంలో బర్ధన్ కీలక పాత్ర పోషించారు. ఇంద్రజిత్ గుప్తా కేంద్ర హోం మంత్రి కావడంతో బర్ధన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2012 మార్చి వరకు ఆ పదవిలో కొనసాగారు. కొత్తవారికి నాయకత్వం బాధ్యత అప్పగించాలని సంకల్పంతో ప్రధాన కార్యదర్శి పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. దేశ రాజకీయాల్లో వామపక్షాలను ఐక్యవేదిక మీదకు తీసుకురావడంలో ఆయన మార్గదర్శకత్వం వహించారు. కమ్యూనిస్టు పార్టీల ఆహ్వానం పై అనేక సోషలిస్టు దేశాలతో పాటు చైనా, వియత్నంలో విస్తృతంగా పర్యటించారు. బంగ్లాదేశ్, నేపాల్ కమ్యూనిస్టు నాయకులు… బర్దన్తో అనేకసార్లు సమావేశంపై సుదీర్ఘంగా చర్చించారు. దక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికా కమ్యూనిస్టు నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ కోసమే జీవించారు. రెండు శతాబ్దాలు అజయ్ భవన్లోనే నిరాడంబర జీవితం గడిపారు. 2016 జనవరి మూడో తేదీన 92వ ఏట దిల్లీలో కన్నుమూశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండపల్లి రాము, సురేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాంద్ భాషా, శంకర్ నాయక్, సత్యనారాయణ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ పాల్గొన్నారు.