కమిటీలు వేయాలని అధికారులకు ఆదేశం
విశాలాంధ్ర-హైదరాబాద్: దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. గ్రామ/ వార్డు, మండల/ పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు విధివిధినాలు రెండు రోజుల్లో రూపొందించాలని సూచించారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాలు మంజూరు చేయించుకోవడంలో తెలంగాణ వెనుకబడి ఉందని, ఈ దఫా గరిష్ట సంఖ్యలో ఇళ్లు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి రావల్సిన బకాయిలు రాబట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అన్నారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఏర్పడే ఇంజినీరింగ్ సిబ్బంది సమస్యను ఎదుర్కోవడానికి ఔట్సోర్సింగ్ పద్ధతిన నియామకాలు చేపట్టాలని సూచించారు. రాజీవ్ స్వగృహంలో నిరుపయోగంగా ఉన్న బ్లాక్లు, ఇళ్లు వేలం వేయాలని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఎండీ వి.పి.గౌతమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అర్హులకు
ఇందిరమ్మ ఇళ్లు