అంగవైకల్య నివారణకు సహకరించాలి
సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం జిల్లాను కుష్ఠు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం మరియు కుష్ఠు వ్యాధులను గుర్తించే కార్యక్రమంలో భాగంగా అంగవైకల్యాన్ని నివారణకు సహకరించాలనే పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కుష్ఠు వ్యాధులను గుర్తించే కార్యక్రమం (లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ – 2024) జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. అంగవైకల్యాన్ని పూర్తిగా నివారణకు సహకరించాలన్నారు. ఎం.డి.టి చికిత్సతో కుష్ఠు వ్యాధి పూర్తిగా నయమవుతుందని, ఈ ఎం.డి.టి చికిత్స ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభ్యం అవుతుందన్నారు. ప్రారంభ దశలోనే కుష్ఠు వ్యాధి నిర్ధారణ, సకాల చికిత్స ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యులే కుష్ఠు వ్యాధి నిపుణులని, అవసరమైనప్పుడు సంప్రదించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ మనసులోని భయాలను వీడాలని, ఎం.డి.టి చికిత్సతో శరీరం నుంచి కుష్ఠు వ్యాధిని తొలగించవచ్చన్నారు. కుష్ఠు వ్యాధి వివక్షత మరియు బహిష్కరణను వ్యతిరేకించాలని, వైకల్యాన్ని అధిగమించేందుకు జాతి మొత్తం ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.
సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం నిర్వహించడం జరుగుతోందని, ఉత్తమ రక్షణతోనే డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చన్నారు. తీవ్ర జ్వరం, తలనొప్పి, కీళ్లు మరియు కండరాల నొప్పి, వికారం, చర్మంపై దద్దుర్లు, అలసట మొదలగు లక్షణాలు కలిగి ఉంటే డెంగ్యూ వ్యాధి కావచ్చని, వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, జిల్లా మలేరియా అధికారి ఓబులు, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.