జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : నూతన ఇసుక విధానము – 2024పై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లాస్థాయి ఇసుక కమిటీ ఆధ్వర్యంలో నూతన ఇసుక విధానము – 2024 పోస్టర్ లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉచిత ఇసుక విధానం అమలులో భాగంగా ఈనెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. రాయదుర్గం మండలం జుంజురాంపల్లి గ్రామం వద్దనున్న ఇసుక నిల్వ కేంద్రం వద్ద ఇసుక ఒక మెట్రిక్ టన్ను ధర 195 రూపాయలు ఉంటుందని, నూతన ఇసుక విధానము గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం అన్నారు. ఇసుక రవాణా కొరకు వినియోగదారులు వారి వాహనములను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొనేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, గనుల శాఖ అసిస్టెంట్ జియాలజిస్ట్ రామకృష్ణ ప్రసాద్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, తదితరులు పాల్గొన్నారు.