రోమ్: పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెరుగుతున్న ఆహార అభద్రత సమస్యలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించవలసిందిగా ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ప్రపంచంలోని ఆహార సంబంధిత సవాళ్లపై సెప్టెంబరులో జరుగనున్న శిఖరాగ్ర సమావేశానికి ముందుగా మూడురోజుల సమావేశాన్ని రోమ్లో వర్చువల్గా నిర్వహించింది. ఈ సమావేశానికి యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అధ్యక్షత వహించారు. 2030 నాటికి ప్రపంచంలో పేదరికం, ఆకలి, అసమానతలు, ఇతర సవాళ్లను అధిగమించేందుకు కఠిన విప్లవాత్మక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కీలకమైన లక్ష్యాల సాధన దిశగా సుస్థిర అభివృద్ధిని సాధించాలని గుటెర్రస్ సూచించారు. పేదరికం, ఆదాయ అసమానతలను, అధిక ఆహార వ్యయాన్ని నియంత్రించడం ద్వారా 3 బిలియన్ల మందికి ఆహారాన్ని అందించగలమన్నారు. ఈ ఏడాది జరిగే ఆహార వ్యవస్థ శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక ప్రతినిధిగా రువాండాకు చెందిన మాజీ వ్యవసాయ మంత్రి అగ్నెస్ కలిబటను గుటెర్రస్ నియమించారు. ఈ సంవత్సరం చర్చలు ప్రధానంగా ఆహార వ్యవస్థలు, పోషకాహారంవైపు ప్రపంచం దృష్టి సారించానికి సహాయపడుతుందని అన్నారు. పనిచేయగల సామర్ధ్యం, ప్రతి ఒక్కరికీ ఆహారం అందించడం, పర్యావరాణాన్ని, వైవిధ్యాన్ని కాపాడగల వ్యవస్థ గురించి మనం ప్రధానంగా దృష్టి సారించాలని కలిబట పేర్కొన్నారు. కరోనా సంక్షోభ కాలంలో వాక్సిన్ల మాదిరిగానే ఆహార సరఫరాలకు ప్రాముఖ్యత నివ్వాలని ఇటలీ ప్రధానమంత్రి మారియో పేర్కొన్నారు. మనం ఆహారాన్ని ఎలా ఉత్పత్తిచేస్తాం..మార్కెట్చేస్తాం..ఎలా వినియోగిస్తాం అనే దానిపై మనిషి ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు ఆధారపడిఉంటుంది. కరోనా మహమ్మారి ఇప్పటికే సమస్యలను తీవ్రతరం చేసిందని దీనిపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవలసిందిగా రోమ్ ఆధారిత ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ డైరెక్టర్ జనరల్ క్యు అన్నారు. ప్రి సమ్మిట్లో కేవలం ఆయా దేవాల ప్రభుత్వ ప్రతినిధులే కాకుండా బహుళపక్ష సంస్థలకు చెందిన రైతులు, పర్యావరణ వేత్తలు, యువ ప్రతినిధులు పాల్గొన్నారు.