ఎట్టకేలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనావైరస్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. బుధవారం రాహుల్ గాంధీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని, ఈ కారణంగానే ఆయన గురువారం, శుక్రవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేదని పార్టీ వర్గాలు శనివారం పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ వ్యూహంపై రాహుల్ మొదటినుంచి కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ టీకా వేయించుకొని సస్పెన్సుకు తెర దించారు. కాగా రాహుల్ గాంధీ కరోనా టీకా ఎందుకు తీసుకోవడం లేదని గతంలో బీజేపీ నాయకుడు సంబిత్ పాత్రతోపాటు పలువురు నాయకులు ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి ఏప్రిల్ 20వతేదీన కరోనా వైరస్ సోకడంతో టీకా ఆలస్యంగా వేయించుకున్నారని ఊహాగానాలు చెలరేగాయి. జూన్ నెలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ టీకా వేయించుకున్నారు. ప్రియాంకగాంధీ మే నెలలో తన మొదటి డోసు టీకా తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఎందుకు కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని బీజేపీ అనేక సందర్భాల్లో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రాహుల్, అతని కుటుంబసభ్యులు టీకాలు తీసుకున్నారో లేదో సకాలంలో సమాచారం ఇచ్చి ఉంటే చాలామంది కరోనాతో చనిపోయేవారు కాదని, ప్రజల మనసులో సందేహాలు సృష్టించినందువల్లే వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగిందని కేంద్రమంత్రి సంస్కృతి మీనాక్షి లేఖి ఆరోపించారు.