జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాది ఇస్మాయిల్ భాయ్ వురపు లంబును భద్రతా దళాలు శనివారం మట్టుబెట్టాయి. లంబు నుంచి ఓ ఏకే-47 రైఫిల్, ఓ ఎం-4 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడి కోసం ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లొజివ్ డివైస్ (ఈఐడీ)ని లంబు తయారు చేశాడని సమాచారం. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అత్యున్నత స్థాయి పాకిస్థానీ ఉగ్రవాది లంబూ ఎన్కౌంటర్లో మరణించినట్లు కశ్మీరు ఐజీపీ విజయ్ కుమార్ విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో మరొక ఉగ్రవాది కూడా మరణించాడని, అతని వివరాలను ఇంకా తెలుసుకోవలసి ఉందని చెప్పారు.