టోక్యో: ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఒలింపిక్స్ 2021లో కరోనా కల్లోలం రేపుతోంది. వందల సంఖ్యలో వివిధ దేశాలకు చెందిన అధ్లెట్లు కరోనాకు గురవుతున్నారు. దీనితో ఒలింపిక్స్ నుంచి చాలామంది ఆటగాళ్లు తప్పుకున్నారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందకుండా ఒలింపిక్ నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టమైన చర్యలకు పూనుకున్నారు. ముఖ్యంగా టోక్యోలో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల నివారణకుగాను జపాన్ ప్రభుత్వం టోక్యో సహా ఆరు నగరాల్లో అత్యయిక పరిస్థితి విధించింది. ఆగస్టు 31 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని ప్రధానమంత్రి యోషిహిడె సుగా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొద్దిరోజులుగా రికార్డుస్థాయిలో నమోదవుతున్న కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు తీవ్రమవుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా నిబంధనలు ప్రజలు విధిగా పాటించాలని కోరింది. మరోవైపు జపాన్లో టీకాల కార్యక్రమం ఊపందుకుంది. ఆగస్టు మాసాంతానికి 40శాతం ప్రజలు రెండు డోసుల టీకాలు తీసుకునేట్లుగా ప్రభుత్వం దృష్టి సారించింది. కొవిడ్ బారినపడిన 50ఏండ్ల పైబడినవారు తీవ్ర లక్షణాలకు లోనుకాకుండా మెరుగైన చికిత్స అందించేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగాఉంది.