న్యూదిల్లీ : ఆగస్టు 1వ తేదీ నుంచి బ్యాంకింగ్, ఆర్థిక రంగ సేవల్లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏటీఎంల నుంచి నగదు విత్డ్రాకు చార్జీలు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై చార్జీలు పెంచింది. ఇవన్నీ ఆదివారం నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు చార్జీ పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిచ్చింది. ఏటీఎం లావాదేవీలపై 2012 నుంచి ఇంటర్ఛేంజ్ ఫీజులను
బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఒక బ్యాంకుకు చెందిన కస్టమర్ మరో బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఈ చార్జీలు వర్తిస్తాయి. ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, నిర్వహించేందుకు వ్యయాలు పెరగడంతో చార్జీలు పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతినిచ్చింది. మరోవైపు, నగదు లావాదేవీలపై ఐసీఐసీఐ బ్యాంకు పరిమితి విధించింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నగదు జమ, వెనక్కి తీసుకునేందుకు మొత్తం నాలుగు ఉచిత లావాదేవీలనే అనుమతించనుంది. ఆ తర్వాత నుంచి ప్రతి లావాదేవీకి రూ.150 రుసుము విధిస్తుంది. మూడో వ్యక్తులు చేసే నగదు జమలపైనా పరిమితులు విధించింది. రూ.25వేల వరకూ రూ.150 రుసుము వసూలు చేయనుంది. ఆపై జమను అనుమతించదు. ఏడాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత 10 చెక్కులుండే ఒక్కో చెక్బుక్కు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్) ఇక నుంచి అన్ని రోజులూ పని చేస్తుందని ఆర్బీఐ వెల్లడిరచింది. ఇది కూడా ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో సెలవు రోజు ఉన్నా.. వేతనాలు, పింఛన్లు, డివిడెండ్లు, వడ్డీ చెల్లింపుల్లాంటివీ బ్యాంకులో జమ అవుతాయి. బ్యాంకు నుంచి నేరుగా వెళ్లే రుణ వాయిదాలు(ఈఎంఐలు) సాధారణంగా సెలవు రోజుల్లో బ్యాంకు నుంచి డెబిట్ కావు. అయితే ఆదివారం నుంచి ఇది మారుతుంది. ఈఎంఐలతో పాటు టెలిఫోన్ బిల్లులు, బీమా పాలసీల ప్రీమియం, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల్లాంటి వాటికి సెలవు రోజు కూడా బ్యాంకు నుంచి ఆ మొత్తం వెళ్లిపోతుంది.
ఐపీపీబీ డోర్స్టెప్ సేవల ఛార్జీలు
ఆగస్టు ఒకటో తేదీ నుంచి డోర్స్టెప్ సేవలకు చార్జీలు విధిస్తున్నట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇంటివద్దకే సేవలు కోరుకునే కస్టమర్లు ప్రతి సర్వీసుకు రూ.20 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే డోర్స్టెప్ సేవల్లో ఐపీపీబీ సిబ్బంది కస్టమర్ ఇంటికి వెళ్లినప్పుడు లావాదేవీలపై ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదని వెల్లడిరచింది. సాధారణంగా ప్రతి నెల ఆరంభంలో చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలు పెంచుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ ధరల సవరణ ఉంటుంది. అయితే ఇటీవల దేశంలో ఇంధన ధరలు పెరగడంతో ఆగస్టు 1న గ్యాస్ ధరలను కూడా పెంచే అవకాశముంది.