రాష్ట్రపతి జోక్యం కోరిన ప్రతిపక్షాలు
రైతు, పెగాసస్ సమస్యలపై పార్లమెంటులో చర్చకు అనుమతించాలని డిమాండ్
న్యూదిల్లీ : రైతు మరణాలపై ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసేలా రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) నేతృత్వంలో కొన్ని ప్రతిపక్ష పార్టీలు శనివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశాయి. పార్లమెంటులో రైతుల సమస్యపై, అలాగే వివాదాస్పద పెగాసస్ స్నూపింగ్ వ్యవహారంపై చర్చకు అనుమతించేలా చూడాలని విజ్ఞప్తి చేశాయి. ఎస్ఏడీ, ఎన్సీపీ, జేకేఎన్సీకు చెందిన నాయకులు రాష్ట్రపతిని కలిసి ఈ మేరకు ఆయన జోక్యాన్ని కోరుతూ వేర్వేరు పార్టీల ప్రతినిధులు సంతకం చేసిన ఒక లేఖను ఆయనకు అందజేశాయి. అయితే ఈ లేఖపై కాంగ్రెస్ సంతకం చేయలేదు. వివాదాస్పద కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహిస్తున్న సమయంలో మరణించిన రైతుల వివరాలను నిర్ధారించడానికి జేపీసీ ఏర్పాటుకు, పార్లమెంటులో పెగాసస్ వ్యవహారంపై చర్చకు అనుమతించేందుకు జోక్యం చేసుకోవాలని ఎస్ఏడీ, శివసేన, ఎన్సీపీ, బీఎస్పీ, జేకేఎన్సీ, ఆర్ఎల్పీ, సీపీఐ, సీపీఎంలతో సహా వేర్వేరు పార్టీలు ఆ లేఖలో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాయి.