10 శాతం దాటిన పాజిటివిటీ రేటు
పది రాష్ట్రాల్లో జోరుగా కేసులు
ఇది మూడవ వేవ్ ముప్పే : కేంద్రం హెచ్చరిక
న్యూదిల్లీ :
కరోనా మూడవ తరంగం కోరలు చాచింది. పది రాష్ట్రాలలో కొవిడ్19 కేసులలో పెరుగుదల కనిపిస్తోందని, 10 శాతానికి మించి పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. కఠినమైన నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టడమే కాకుండా రాష్ట్రాలు 45
60 ఏళ్ల మధ్య వయస్కులకు వాక్సినేషన్ను విస్తృతం చేయాలని సూచించింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అసోం, మిజోరం, మేఘాలయ, ఆంధ్ర ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలలో కొత్త కొవిడ్ కేసులలో పెరుగుదల లేదా పాజిటివిటీ రేటు పెరుగుదలను చూస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 46 జిల్లాల్లో 10 శాతానికి మించి, 53 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్య పాజిటివిటీ రేటు ఉండటంతో రాష్ట్రాలు కొవిడ్ పరీక్షలను, వాక్సినేషన్ను పెంచాలని, అలాగే 80 శాతం మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నందున వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్రాలకు స్పష్టంగా సూచించింది. ఈ దశలో ఏదైనా అలసత్వం వహిస్తే ఆయా రాష్ట్రాలలో పరిస్థితి క్షీణిస్తుంది’ అని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో చర్యలను చర్చించారు. రాష్ట్రాల నుంచి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతోపాటు భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ కూడా హాజరయ్యారు. ‘గత కొన్ని వారాలలో 10 శాతానికి మించి పాజిటివిటీ నమోదయిన అన్ని జిల్లాల్లో ప్రజల కదలికలను నిరోధించడం లేదా ఆంక్షలు విధించవలసిన అవసరం ఉంది’ అని కేంద్రం పేర్కొంది. వైరస్ తీవ్ర పెరుగుతోన్న రాష్ట్రాలలో కొవిడ్ కట్టడి చర్యలు, టెస్టులు ముమ్మరం చేస్తూనే వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, రెండో డోసు వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఇదే సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రైవేటు ఆస్పత్రులను ప్రోత్సహించాలని తెలిపింది. కొత్త వేరియంట్లను గుర్తించేందుకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నమూనాలను ఇన్సాకాగ్ సహాయంతో జీనోమ్ స్వీక్వెన్సింగ్ చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. హోం ఐసోలేషన్లో ఉన్న వారికి వైద్య సహాయం అవసరమైతే సకాలంలో వారిని ఆసుపత్రుల్లో చేర్చే ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించాలని కోరింది.