పాట్నా : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్టాలిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలిస్తున్నారు. రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించడానికి ఆయన చెన్నైలోని కన్నాగి ప్రాంతంలోని ఓ టీకా కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకునే వారితో మాట్లాడారు. తిరుగు ప్రయాణంలో అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును చూసి సీఎం తన కాన్వాయ్ ఆపి…బస్సు ఎక్కారు. ఈ పరిణామంతో బస్సులోని డ్రైవరు, కండక్టరు, ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. స్టాలిన్ను చూసిన సంతోషంగా అందరూ ఫొటోలు, వీడియోల కోసం ఎగబడ్డారు. బస్సులో ఆకస్మిక తనిఖీ చేపట్టిన స్టాలిన్…ఆర్టీసీ సదుపాయాల గురించి ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బస్సులు సమయానికి వస్తున్నాయా? మహిళలకు ఉచిత టికెట్లు సక్రమంగా అమలవుతున్నాయా? ఉచిత టికెట్ల వల్ల ఉపయోగం ఉందా? అని అడిగి తెలుసుకున్నారు. బస్సులో మాస్క్లు పెట్టుకోని వారిని సుతిమెత్తగా మందలిస్తూ అందరూ మాస్క్లు ధరించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తమిళనాడు సీఎంఓ కార్యాలయం ట్విట్టర్లో పోస్టు చేసింది. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.