Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కశ్మీర్‌లో భద్రతపై అమిత్‌ షా సమీక్ష

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో భద్రతాపరిస్థితులపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా శనివారం సమీక్ష నిర్వహించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సహా సైన్యానికి చెందిన ముఖ్య అధికారులంతా పాల్గొన్నారు. కశ్మీర్‌లో భద్రత, ఉగ్రవాద నిర్మూలనకు సైనిక బలగాలు తీసుకుంటున్న చర్యలపై అధికారులు షా కు వివరించారు. అంతకుముందు కశ్మీర్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం శ్రీనగర్‌ చేరుకున్న అమిత్‌ షా.. ఇటీవల ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన జమ్ముకశ్మీర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్వేజ్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అహ్మద్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కశ్మీర్‌లో షా మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం ఆయన కశ్మీర్‌కు రావడం ఇదే మొదటిసారి.
పకడ్బందీ భద్రతాచర్యలు
ఒకవైపు కశ్మీర్‌ లోయలో వరుసగా పౌర హత్యలు, మరోవైపు ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు భద్రతా బలగాల ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో అమిత్‌ షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లోయలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అమిత్‌షా బస చేసే శ్రీనగర్‌లోని రాజ్‌ భవన్‌ చుట్టూ 20 కి.మీ పరిధిలో అనుమానాస్పద కదలికలను ట్రాక్‌ చేసేందుకు డ్రోన్‌లు ఏర్పాటు చేశారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు దాల్‌ సరస్సు, ఇతర ప్రాంతాలపై నిఘా చేపట్టాయి. వ్యూహాత్మక ప్రదేశాల్లో స్నైపర్లు, షార్ప్‌షూటర్‌లను మోహరించారు. స్థానిక పోలీసులు.. పౌరులతోపాటు వాహనాలనూ తనిఖీ చేస్తున్నారు.
శ్రీనగర్‌తో పాటు కశ్మీర్‌ లోయలోని పలుచోట్ల సీఆర్పీఎఫ్‌ దళాల బంకర్లు ఏర్పాటు చేశారు. కశ్మీర్‌ లోయలోని అనేక రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేశారు.తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఇటీవల స్థానికేతర వలస కార్మికులు హత్యకు గురైన ప్రాంతాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. కశ్మీర్‌ లోయలోని ప్రధాన మార్గాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. అయితే ఉగ్రవాదుల హింసాత్మక కార్యక్రమాల కారణంగానే వాహనాలను సీజ్‌ చేయడం, మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకున్నట్లు కశ్మీర్‌ జోన్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. దీనికి కేంద్ర హోం అమిత్‌ షా పర్యటనతో సంబంధం లేదంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img