గోసబా : బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ నేతలు అగౌరవపరిచారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయనున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ 24 పరగణాలలోని గోసాబా వద్ద శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో బెనర్జీ ప్రసంగిస్తూ…బీజేపీకి ఉపఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కులేదన్నారు. గోసబా, ఖర్దా అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థులు మృతి చెందడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయని తెలిపారు. అయితే శాంతిపూర్, దిన్హటాలో జరుగుతున్న ఎన్నికలకు బీజేపీనే కారణమని పేర్కొన్నారు. ఆ పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులు జగన్నాథ్ సర్కార్, నిసిత్ ప్రామాణిక్ రాజీనామా చేసి ప్రజలను అవమానించారని విమర్శించారు. మళ్లీ ఆ స్థానాల్లో బీజేపీ పోటీ చేసి ఓట్లు అడిగితే ప్రజలే తిరస్కరిస్తారని పేర్కొన్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ప్రకటించిన రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీని విడుదల చేయాలని, ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు సహకరించాలని డిమాండు చేశారు. దిల్లీలో అధికారంలో ఉండి రాష్ట్రానికి బీజేపీ నేతలు చేస్తున్న మేలు ఏమీలేదని వ్యాఖ్యానించారు. తాను చేసిన ప్రతి వాగ్దానాన్ని సీఎం మమతా బెనర్జీ నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు.