మంగళగిరి కేంద్ర కార్యాలయంలో అరాచకం
ఇతర ప్రాంతాల్లోనూ ఆఫీస్లు, నేతల ఇళ్లపై దౌర్జన్యాలు
రేణిగుంటలో బాహాబాహీ
బాలకృష్ణ ఇంటిముట్టడికి యత్నం
గవర్నర్, అమిత్షాలకు చంద్రబాబు ఫోన్
రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్
నేడు రాష్ట్ర బంద్కు పిలుపు
దాడులను తీవ్రంగా ఖండిరచిన విపక్షాలు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఏపీ డీజీపీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు పట్టపగలు దాడికి తెగబడ్డారు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆటోలు, కార్లలో ఒక్కసారిగా వచ్చిన దౌర్జన్యకారులు కర్రలు, ఇనుపరాడ్లతో టీడీపీ కార్యాలయంలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. రాళ్లదాడికి పాల్పడ్డారు. కార్యాలయం అద్దాలు, లోపల ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఆఫీస్ లోపలా, బయటా నిలిపి ఉంచిన వాహనాలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలన్నీ ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో టీడీపీ కార్యాలయంలో ఉన్న కెమెరామన్ బద్రీ, ఏబీఎన్ రిపోర్టర్…దాడిని చిత్రీకరించే ప్రయత్నం చేయగా వారిపైనా దాడి చేసి గాయపర్చారు. రిపోర్టర్లను పొట్టలో పిడిగుద్దులు గుద్దారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అదేసమయంలో విజయవాడలోని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నివాసంపై వైసీపీ శ్రేణులు దాడి చేసి ఇంటి ఆవరణలోని కారు, ద్విచక్రవాహనం, ఇంట్లోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. దాదాపు 200 మంది ఒక్కసారిగా ఇంటిపై దాడికి దిగారని పట్టాభి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. పట్టాభి దొరికితే చంపేస్తామంటూ కేకలు వేస్తూ ఇంట్లోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేసినట్లు తెలిపారు. విశాఖపట్నంలోనూ టీడీపీ కార్యాలయంలోకి వైసీపీ మహిళలు చొచ్చుకెళ్లారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి యత్నించారు. అక్కడ మాత్రం పోలీసులు అప్రమత్తమై వైసీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత లింగారెడ్డి ఇంటిని ముట్టడిరచేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంటలో టీడీపీ నేతల ర్యాలీపై అధికారపార్టీ శ్రేణులు దాడికి దిగాయి. టీడీపీ నేత బొజ్జల సుధీర్రెడ్డి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి నరసింహయాదవ్ అధ్వర్యంలో రేణిగుంట అంబేడ్కర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఆ పార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని వైసీపీకి చెందిన రేణిగుంట సర్పంచ్ నగేశ్, ఉప సర్పంచ్ సుజాత, వారి అనుచరులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలపై చెప్పులు, చీపుర్లతో నేతలు దాడి చేశారు. పోలీస్స్టేషన్కు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో అప్రమత్తమైన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. సుధీర్రెడ్డి, నరసింహయాదవ్ ర్యాలీ ముగించుకుని కారులో ఇంటికి వెళుతున్న సమయంలో వైసీపీ శ్రేణులు మరోసారి రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలను లక్ష్యంగా చేసుకుని జరిగిన వరుస దాడులతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడిరది. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సారథ్యంలో జనాన్ని పోగు చేసి తమ కార్యాలయంపై దాడికి పంపారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు ఆరోపించారు. వందలాది మంది ఒక్కసారిగా పార్టీ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు, కార్లు ధ్వంసం చేశారని, పక్కనే డీజీపీ కార్యాలయానికి ఫోన్ చేసినా స్పందించలేదని అశోక్బాబు అన్నారు.
అమిత్షా, గవర్నర్కు చంద్రబాబు ఫోన్
దాడి విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి పార్టీ శ్రేణులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైసీపీ శ్రేణుల దాడిలో దెబ్బతిన్న కార్యాలయ సామగ్రి, ధ్వంసమైన నేతల వాహనాలను పరిశీలించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫోన్ చేసి టీడీపీ కార్యాలయాలు, నేతలను లక్ష్యంగా చేసుకుని అధికారపార్టీకి చెందిన వారు చేసిన దాడులను వివరించారు. అనంతరం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్షాతో మాట్లాడి రాష్ట్రంలో పరిణామాలు వివరించారు. కేంద్ర బలగాల సాయం కోరారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికార పార్టీ దౌర్జన్యాలు తారస్థాయికి చేరాయని ధ్వజమెత్తారు.
రాష్ట్ర బంద్కు పిలుపు
టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్కి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. డీజీపీకి, సీఎంకు తెలిసే టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగిందని ఆరోపించారు. 40 ఏళ్ల పాటు రాజకీయాలు చూశాను. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. పథకం ప్రకారం ఒకేసారి రాష్ట్రంలో అనేక చోట్ల దాడులు చేశారు. 100 మీటర్లలోపే డీజీపీ కార్యాలయం ఉన్నా దాడులు ఆపలేకపోయారు. పార్టీ కార్యాలయంపై దాడులు చేసి చంపే ప్రయత్నం చేస్తోంటే డీజీపీ ఎక్కడ పడుకున్నారు. డీజీపీ నేరస్తులతో లాలూచీ పడతారా? ఇది టీడీపీకి సంబంధించినది కాదు. ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం. పార్టీ కార్యాలయం, నేతల పైనే దాడులు జరిగితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శమని, అందువల్ల ప్రజాస్వామ్య రక్షణ కోసం తక్షణమే ఆర్టికల్ 356 వినియోగించి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.