పాట్నా : సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న బీహార్ ఎన్డీఏలో విభేదాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయంటూ ఎన్డీఏ మిత్రపక్షమైన లోక్ జనశక్తి చీలిక వర్గానికి నేతృత్వం వహిస్తోన్న నేత చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పాట్నాలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మధ్యపాన నిషేధం అమలవుతున్న తీరు తెన్నుల విషయంలో జేడీయూ, బీజేపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టు తెలిపారు. రానున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకే సీఎం సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఇటీవలే ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్టు చెప్పారు. బీజేపీ, జేడీయూల మధ్య విభేదాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై స్పందించిన చిరాగ్ పాశ్వాన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి తాను ఈ కూటమి ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాధించదని చెబుతూనే ఉన్నానని గుర్తుచేశారు. ఆ క్రమంలోనే నేడు మధ్యపానం నిషేధం విషయంలో బీజేపీ, జేడీయూ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోందని తెలిపారు. ప్రభుత్వ కూటమిలోని నేతల మధ్యన కూడా విభేదాలున్నాయని వివరించారు. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను తన పార్టీని పటిష్టం చేసే పనిలో ఉన్నట్టు చెప్పారు. భవిషత్తులో జరిగే ఎన్నికల పొత్తులపై ఇప్పుడేమీ చెప్పలేమని ఆ సమయంలోనే ఆ విషయంపై ఆలోచిస్తామని పేర్కొన్నారు.