ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమర్పణ
ఈ నెల 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల తొలివిడత ఫిబ్రవరి 11వరకు కొనసాగనున్నాయి. దాదాపు నెల రోజుల విరామం తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండోవిడత జరగనుంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాజ్యసభ, లోక్సభ సమావేశాలను షిఫ్ట్ల వారీగా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భౌతిక దూరం పాటించేవిధంగా సీట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఓ అధికారి మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను సురక్షితంగా నిర్వహించేందుకు వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు కోవిడ్ పరిస్థితినిబట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. లోక్సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ఈ నెల 25న లేదా 26న సమావేశమై సమావేశాలను ఏ విధంగా నిర్వహించాలో నిర్ణయిస్తారన్నారు. కొందరు పార్లమెంటు సభ్యులకు కోవిడ్ సోకినందువల్ల ఈ సమావేశాల కాలాన్ని కుదించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభల ఎన్నికలు కూడా పార్లమెంటు సమావేశాల కుదింపునకు కారణం కావచ్చునని తెలిపారు. ఇటీవల పార్లమెంటులో కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. దాదాపు 400 మంది పార్లమెంటు సిబ్బందికి పాజిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో లోక్సభ సభాపతి ఓం బిర్లా మంగళవారం పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ను పరిశీలించారు. పార్లమెంటు సమావేశాల నిర్వహణకు సంబంధించిన భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్షించారు. వయసు 60 ఏళ్ళు పైబడిన ఎంపీల పట్ల మరింత శ్రద్ధవహించాలని అధికారులను ఆదేశించారు.