దేశంలో 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేసే ప్రక్రియ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్కి చెందిన కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోడా తెలిపారు. అప్పటివరకు 15 నుంచి 16 ఏళ్ల లోపు వయసు వారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. జనవరి 3న 15`18 ఏళ్ల లోపు వారికి టీకాలు వేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ఈ వయస్సు పిల్లలు మొదటి డోసు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం ట్వీట్ చేశారు. మరోవైపు 60 ఏళ్లు పైబడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రికాషన్ డోసుల పంపిణీ కొనసాగుతోంది.