పీఎస్యూ బ్యాంకుల్లో పూర్తి వాటా విక్రయానికి కేంద్రం సన్నద్ధం
పూర్తిస్థాయి ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం కసరత్తు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిల్లుకు యోచన
న్యూదిల్లీ :
దేశ సంపదను అప్పనంగా అమ్మేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ సకల యత్నాలు చేస్తోంది. ఎన్నో కార్మిక పోరాటాలు, ప్రజల త్యాగాల ఫలితంగా సాధించుకున్న ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి యధేచ్ఛగా కార్పొరేట్ల పరం చేసేందుకు ముమ్మర కసరత్తు చేపట్టింది. ఇప్పటికే అనేక పీఎస్యూలను అమ్మేసిన ప్రభుత్వం తన పాలనలో మరిన్ని దుందుడుకు, ప్రజా, కార్మిక వ్యతిరేక చర్యలకు శ్రీకారం చుట్టింది. అడ్డూఅదుపు లేని ఏకపక్ష నిర్ణయాలతో ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వరంగ బ్యాంకులను వంద శాతం ప్రైవేటీకరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిల్లుకు యోచన చేస్తోంది.
కేంద్రం ఇప్పటికే ఉన్న జాతీయ బ్యాంకులను విలీనం చేసి రెండంకెలకు కుదించేసింది. తాజాగా ఆ బ్యాంకుల నిర్వహణ బాధ్యతల నుంచి బీజేపీ ప్రభుత్వం తప్పుకోవాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఐడీబీఐ బ్యాంక్లో వాటాను విక్రయించేందుకు కసరత్తు చేస్తోంది. పీఎస్యూ బ్యాంకుల్లో తన పూర్తి వాటాను విక్రయించేందుకు చురుగ్గా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించింది. భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) లో 3.5 శాతం వాటాను విక్రయించారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వంద శాతం వాటాను ప్రైవేటు సంస్థలకు విక్రయించడానికి, అనుమతించడానికి ప్రభుత్వం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం బ్యాంకింగ్ కంపెనీల (అండర్టేకింగ్ల స్వాధీనం, బదిలీ) చట్టం-1970కి సవరణను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ బ్యాంకుల నుంచి పూర్తిగా వైదొలగేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి.
ప్రభుత్వ వాటా తగ్గించాలని కేంద్రం ఆలోచన
బ్యాంకింగ్ చట్టం ప్రకారం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వం కనీసం 51 శాతం వాటాను కలిగి ఉండాలి. ముందుగా ఈ వాటాను 26 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే బిల్లును ప్రవేశపెడితే, అటువంటి బ్యాంకుల్లో 0 శాతం వాటాను కలిగి ఉండడాన్ని ఆమోదించవచ్చు. ఇటీవల ఐడీబీఐ బ్యాంక్లో వాటా విక్రయానికి సంబంధించిన చర్చలు చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ప్రైవేటీకరణ చేసే వాటిల్లో ఉన్నాయి.
ప్రభుత్వ బ్యాంకుల యాజమాన్య సమస్యలపై చర్చించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తుత సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు. ఈ బిల్లును ముందుగా 2021లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. దీనికి బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు- 2021 అని పేరు పెట్టారు. అయితే దీనిని ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు వంద శాతం బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు కసరత్తు జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.