Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నిరసన జ్వాల

రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ధర్నాలు, ప్రదర్శనలు
ప్రభుత్వంలో విలీనం చార్జీలు పెంచడానికా?
చార్జీలు తగ్గించే వరకు పోరాడతాం
రాష్ట్ర బంద్‌కూ వెనుకాడం: విజయవాడ ధర్నాలో రామకృష్ణ, మధు హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రజాగ్రహం పెల్లుబుకింది. ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో మూడుసార్లు బస్సు చార్జీలు పెంచడంపై శనివారం వామపక్షాల అధ్వర్యాన జరిగిన ఆందోళనల్లో ప్రజలు పార్టీలకతీతంగా పెద్దసంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. విజయవాడ బస్టాండ్‌ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ తక్షణమే పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని, లేకపోతే అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని రాష్ట్రబంద్‌ చేస్తామని హెచ్చరించారు. చార్జీల పెంపును నిరసిస్తూ సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్ష పార్టీల అధ్వర్యాన శనివారం ఉదయం సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, సీపీఎం సిటీ కోఆర్డినేటర్‌ డి.కాశీనాథ్‌ అధ్యక్షతన విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ ప్రధాన ద్వారం వద్ద నిరసనధర్నా నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు ఆర్టీసీ చార్జీలు పెంచాయని, అయితే వైసీపీ ప్రభుత్వం తరహాలో ఇంత భారీగా ఎన్నడూ పెంచలేదన్నారు. రెండున్నర నెలల కిందట డీజిల్‌ సెస్‌ పేరుతో చార్జీలు పెంచి రూ.720 కోట్ల భారం మోపిన ప్రభుత్వం.. మళ్లీ ఇప్పుడు మరో రూ.600 కోట్ల వసూలు కోసం భారీగా పెంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామీణ ప్రజలు ఎక్కువగా ప్రయాణించే పల్లెవెలుగు బస్సు చార్జీలను కూడా 62 శాతం పెంచడానికి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది చార్జీలు పెంచుకోవడానికి అన్నట్లుగా వైసీపీ సర్కారు వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే విద్యుత్‌ చార్జీలు భారీగా పెంచారని, మళ్లీ ఆగస్టు ఒకటో తేదీ నుంచి ట్రూ అప్‌ చార్జీల పేరుతో రూ.3వేల కోట్ల వసూలుకు రంగం సిద్ధమైందని చెప్పారు. పొరుగు రాష్ట్రాల కన్నా ఆంధ్రాలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, ఇనుము, ఇసుక, సిమెంట్‌ సహా అన్ని ధరలు అధికమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఒకవైపు ప్రజలపై పదేపదే భారాలు మోపుతూ…మరోవైపు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తోందని మండిపడ్డారు. పి.మధు మాట్లాడుతూ కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని పక్కన పెట్టి సెస్‌ల పేరుతో ప్రజలపై భారం మోపుతోందని, సెస్‌లో వాటా రాష్ట్రాలకు రాదని తెలిపారు. సెస్‌ల రూపంలో వసూలు చేసిన సొమ్ములో వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయకుండా మళ్లీ ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు బాగాలేవని, వెంటనే వారు దిగిపోవాలని, తాము గద్దె నెక్కాలని ఆరాట పడుతున్న టీడీపీ, జనసేన..ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయని విమర్శించారు. సీపీఐ ఎంఎల్‌(న్యూడెమోక్రసీ) నాయకుడు పోలారి, సీపీఐ ఎంఎల్‌ నాయకులు లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్రం జీఎస్టీ పేరుతో మజ్జిగ, అప్పడాలపైనా పన్నులు వేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని చార్జీలు, పన్నులు పెంచి వేధిస్తోందన్నారు. సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యుడు సీహెచ్‌ బాబూరావు, సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్ష పార్టీల, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బస్సు చార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు.
తిరుపతిలో
ప్రజలకు భారం కానున్న బస్సు చార్జీలు రద్దు చేయకపోతే ముఖ్యమంత్రి జగన్‌కి తగిన బుద్ధి చెపుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి హరినాథరెడ్డి హెచ్చరించారు. తిరుపతిలో సీపీఐ, సీపీఎం అధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం నుండి ఆర్టీసీ బస్సు డిపో వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, సీపీఐ నగర కార్యదర్శి జె.విశ్వనాథ్‌, నగర కార్యవర్గ సభ్యులు బి.నదియ, ఎన్‌.శ్రీరాములు, ఎన్‌డీ రవి, ఎం.రామకృష్ణ, కేవై రాజా, సీహెచ్‌ శివకుమార్‌, శశి కుమార్‌, మహేంద్ర, సీపీఎం నగర కార్యదర్శి టి.సుబ్రమణ్యం, నాయకులు జయచంద్ర, శీను, సాయిలక్ష్మీ, రాధ, ఆర్‌.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
కడపలో
జగన్‌ ప్రభుత్వం ఆర్భాట ప్రచార ఖర్చులు తగ్గించుకోకుండా రెండున్నర నెలల్లో రెండవసారి ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపడం దారుణమని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు జి.ఈశ్వరయ్య, ఏ.చంద్రశేఖర్‌ మండిపడ్డారు. డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ కడప ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సీపీఐ, సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసన అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించిన వెంకట శివ, చంద్ర, చంద్రశేఖర్‌, మల్లికార్జునలను అరెస్టు చేసి చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
సీపీఐ నగర కార్యదర్శి యన్‌.వెంకట శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.కృష్ణమూర్తి, ఎల్‌.నాగసుబ్బారెడ్డి, సి.సుబ్రహ్మణ్యం, జి.చంద్ర, పి.చంద్రశేఖర్‌, కేసీ బాదుల్లా, జి.మద్దిలేటి, సీపీఎం నాయకులు రామ్మోహన్‌ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అన్వేష్‌, లోక్‌సత్తా నాయకులు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరులో
ఆర్టీసీ చార్జీల పెంపుపై ఉమ్మడి గుంటూరు జిల్లా(గుంటూరు, పల్నాడు, బాపట్ల)లో నిరసనలు హోరెత్తాయి. గుంటూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొనగా, పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన నిరసనలో పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్‌, బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన నిరసనలలో బాపట్ల జిల్లా సీపీఐ కార్యదర్శి పి.నాగాంజనేయులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌ జిల్లాలో
ఆర్టీసీ చార్జీల పెంపుపై ఇబ్రహీంపట్నం బస్‌డిపో వద్ద ధర్నా చేపట్టారు. ఎన్టీఆర్‌ జిల్లా సీపీఐ కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు, మైలవరం నియోజకవర్గ కార్యదర్శి బుడ్డి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులో
బస్సు చార్జీలను నిరసిస్తూ ప్రకాశం జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. వామపక్షాలతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలోనూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఒంగోలులో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్‌, న్యూ డెమోక్రసీ అధ్వర్యంలో ధర్నా చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలోనూ ఒంగోలుతో పాటు పర్చూరు, మార్కాపురం, కందుకూరు తదితర ప్రాంతాల్లో నిరసనలు కొనసాగాయి. ఒంగోలులో సీపీఐ జిల్లా నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావుతో పాటు సీపీఎం జిల్లా కార్యదర్శి హనీఫ్‌, సీపీఐ ఎంఎల్‌ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు పీవీఆర్‌ చౌదరి, కొత్తకోట వెంకటేశ్వర్లు, కె.నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు కొండారెడ్డి, ఆంజనేయులు, సీపీఐ న్యూడెమోక్రసీ నాయకులు పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో
ఏలూరు జిల్లాలో వామపక్షాల అధ్వర్యంలో నిరసనలు జరిగాయి. సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ కొయ్యలగూడెంలో చార్జీల పెంపునకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు వామపక్షాలతో కలిసి ధర్నా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో సీపీఐ మండల కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, కామవరపు కోటలో టీవీఎస్‌ రాజు, కుక్కునూరులో సీపీఐ మండల కార్యదర్శి మైసాక్షి వెంకటాచారి, చింతలపూడిలో సీపీఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, సహాయ కార్యదర్శి తుర్లపాటి బాబు, నూజివీడులో సీపీఐ పట్టణ కార్యదర్శి సీహెచ్‌ పుల్లారావు, భీమవరంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్వర్యంలో, ఉండిలో సీపీఐ మండల కార్యదర్శి కలిశెట్టి వెంకటరావు అధ్వర్యంలో వామపక్షాలతో కలిసి బస్టాండ్‌ వద్ద ధర్నా చేపట్టారు.
కర్నూలులో
పెంచిన బస్సు చార్జీలు తగి ్గంచాలని వామపక్షపార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షపార్టీలు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఎదుట, రోడ్లుపై బస్సులు నిలిపివేసి నిరసన తెలిపాయి. కర్నూలు, నంద్యాల, డోన్‌, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు, నందికొట్కూరు, బనగానపల్లెలో ఆందోళనలు నిర్వహించారు.
విశాఖలో
బస్‌ చార్జీలు తక్షణమే తగ్గించాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో నేతలు నిరసనలు తెలిపారు. విశాఖలోని ద్వారకా బస్టాండ్‌ వద్ద సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఎం.పైడిరాజు, ఎం.జగ్గునాయుడు నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. నర్సీపట్నంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ అధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
అనకాపల్లి జిల్లాలో
అనకాపల్లిలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు, సీపీఎం నాయకులు బాలకృష్ణ నేతృత్వంలోనూ, చోడవరంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు, కొయ్యూరులో సీపీఐ మండల కార్యదర్శి ఇరువాడ దేవుడు అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ నేతలు మాదల సత్యనారాయణ, గండేపల్లి నూకరాజు, ఉల్లి విజయ్‌కుమార్‌, కాకర రాంబాబు, పొటుకూరి దారమల్లేశ్‌, సోమెల దారమల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు. చోడవరంలో ఏరియా కార్యదర్శి నేమాల హరి, సహాయ కార్యదర్సి పొట్నూరు మరిడి, పి.అప్పారావు, జలగడుగుల శివ, పూర్ణ, కోడి నూకరాజు, సాయి, అనుబంధ ప్రజా సంఘాలు, మోటారు వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి, అనంత జిల్లాల్లో
బస్సుచార్జీల పెంపునకు నిరసనగా సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు జరిగాయి. అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట జరిగిన ధర్నాలు సీపీఐ జిల్లాకార్యదర్శి జాఫర్‌ మాట్లాడారు. అనంతపురం జిల్లాలోగుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, ఉరవకొండ డిపోల ఎదుట ధర్నాలు చేపట్టారు. సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, హిందూపురం, మడకశిర డిపోల ఎదుట ధర్నాలు జరిగాయి. సీపీఐ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య మాట్లాడారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, నాయకులు శ్రీరాములు, లింగమయ్య, రమణ, మల్లికార్జున, సీపీఎం నాయకులు నల్లప్ప, రామిరెడ్డి, వెంకట నారాయణ, వలి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌ రెడ్డి, ఎస్‌యూసీఐ నగర కార్యదర్శి తబ్రేజ్‌, పట్టణ పేదల సంఘం అధ్యక్షుడు వీర నారప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img