అంతర్జాతీయ సమాజానికి స్పెయిన్, టర్కీ పిలుపు
మాడ్రిడ్: గాజాలో ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపేందుకు కలిసి రావాలని అంతర్జాతీయ సమాజానికి స్పెయిన్, టర్కీ దేశాలు పిలుపునిచ్చాయి. గాజాకు మానవతా సాయాన్ని ఈ రెండు దేశాలు అందిస్తున్నాయి. చేతనైన సాయం చేస్తున్నాయి. స్పెయిన్, టర్కీ దేశాధినేతలు మాడ్రిడ్లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గాజా గురించి మాట్లాడుకున్నారు. యుద్ధం ఆపే విధంగా ఇజ్రాయిల్పై ఒత్తిడి తేవాలని అంతర్జాతీయ సమాజాన్ని స్పెయిన్, టర్కీ కోరాయి. ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా రెండు దేశాల మధ్య ఆర్థిక, సహకార భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని నాయకులు సంకల్పించారు. అనంతరం స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ విలేకరులతో మాట్లాడుతూ ‘గాజా నుంచి చూపు తిప్పుకున్న అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా స్పందించడం అవసరం. ఈ సమస్యను పరిష్కరించి, శాంతి, సుస్థిరత నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవడం తక్షణావశ్యం. ఎనిమిది నెలలుగా జరుగుతున్న దానితో ప్రపంచానికి కనువిప్పు కలిగింది’ అని అన్నారు. గాజాలో శాంతి, సుస్థిరత కోసం కృషి చేయాలని యూరోపియన్, పశ్చిమ దేశాలకు పిలుపునిచ్చారు. బందీల విడుదల చేయాలని కూడా కోరాయి. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్దోగన్ మాట్లాడుతూ గాజా విషయంలో స్పెయిన్ వైఖరిని అభినందించారు. మిగతా దేశాలు కూడా స్పెయిన్ను ఆదర్శంగా తీసుకొని గాజాకు అండగా నిలుస్తాయని ఆకాంక్షించారు. స్పెయిన్ ప్రధానికి తన మనస్సులో ప్రత్యేక స్థానం ఉన్నట్లు ఎర్దోగన్ తెలిపారు. గాజాలో ఇజ్రాయిల్ మారణహోమం సృష్టిస్తోందని, దురహంకారంతో వ్యవహరిస్తోందని, కాల్పులు విరమించకుండా రక్తం చిందిస్తోందని ఆరోపించారు. స్పెయిన్ ప్రధానితో తన చర్చల్లో గాజా యుద్ధం కీలకాంశంగా నిలిచినట్లు ఎదర్గోన్ తెలిపారు. కాగా, గాజాలో ఇప్పటివరకు 37వేల మందికిపైగా పలస్తీనియన్లు మరణించినట్లు పలస్తీనా ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. పలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు స్పెయిన్, ఐర్లాండ్, నార్వే మే 28న వేర్వేరుగా ప్రకటించాయి. అమెరికా, ఇజ్రాయిల్తో పాటు పశ్చిమ దేశాలు మినహా 140కుపైగా దేశాలు పలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నాయి.