. రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయం
. స్పీకర్గా అయ్యన్నపాత్రుడు?
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మళ్లీ మార్పు చోటుచేసుకుంది. ఈనెల 21 నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈనెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కానీ తాజాగా 21, 22 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణస్వీకారం, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శాసనసభ స్పీకర్గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. ఉపసభాపతి, చీఫ్విప్పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం శాసనసభకు ఎన్నికైన వారిలో సీనియార్టీ పరంగా అయ్యన్నపాత్రుడు ముందు వరుసలో ఉన్నారు. అలాగే బీసీ వర్గానికి చెందినవారు కావడంతో ఇటు సీనియారిటీ, అటు సామాజికపరంగా ఆయనకు న్యాయం చేసినట్లవుతుందని టీడీపీ అధిష్ఠానం ఆయనవైపు మొగ్గుచూపింది. ఇక ఆయన తర్వాత సీనియర్ శాసనసభ్యుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి ఉన్నారు. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో వీరిలో కూడా సీనియర్ సభ్యుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించే అవకాశం ఉంది. ఉపసభాపతి జనసేనకు కేటాయిస్తే ఆ పార్టీ నుంచి సీనియర్ సభ్యుడిగా ఉన్న మండలి బుద్దప్రసాద్కి అవకాశం ఉందని భావిస్తున్నారు.