పవిత్ర హజ్ యాత్రలో ఎండ తీవ్రరూపం దాలుస్తోంది. ఎండలు, ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. ఈసారి యాత్రలో ఎండ వేడిమికి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతిచెందారని మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. ఇక చనిపోయిన వారిలో ఈజిప్ట్, జోర్డాన్ దేశస్తులు అధికంగా ఉన్నారు. సుమారు 323 మంది ఈజిప్టియన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 60 మంది జోర్డానియన్లు కూడా మరణించారని తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 577కి చేరినట్లు తెలుస్తోంది.వీరంతా వేడి సంబంధిత సమస్యలతోనే మరణించినట్లు వెల్లడించారు. వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం తప్పడం లేదు. ఇక మక్కాలోని అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటైన అల్-ముయిసెమ్ ఆసుపత్రి మార్చురీలో మొత్తం 550 మృతదేహాలు ఉన్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. వేడి సంబంధిత సమస్యలతో బాధపడిన సుమారు 2,000 మంది యాత్రికులకు చికిత్స అందించినట్లు సౌదీ అధికారులు తెలిపారు.ప్రస్తుతం మక్కాలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద సోమవారం 51.8 డిగ్రీల సెల్సియస్ (125 ఫారెన్హీట్) ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో హజ్ యాత్రకు వెళ్లిన భక్తుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రతి దశాబ్దం సౌదీ అరేబియాలో 0.4 డిగ్రీల వేడి పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఈ హజ్ యాత్ర ఈనెల 19వ తేదీతో (బుధవారం) ముగియనుంది. ఇక గతేడాది కూడా హజ్ యాత్రలో 240కి పైగా మరణాలు నమోదయ్యాయి.