మూత్రపిండాల సమస్యలతో యువతి
అత్యాధునిక చికిత్సతో నయం చేసిన కిమ్స్ సవీరా వైద్యులు
విశాలాంధ్ర` అనంతపురం వైద్యం : అనంత జిల్లాలోనే మొట్ట మొదటిసారిగా వీనోప్లాస్టీ ద్వారా చికిత్స చేసి యువతికి ఊరట కల్పించారు కిమ్స్ సవీరా గుండె వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్ కృష్ణ. చిన్న వయసులోనే దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ, దాంతోపాటే గుండె రక్తనాళాల్లో పూడిక ఏర్పడిన యువతికి అనంతపురంలోని కిమ్స్ సవీరా వైద్యులు అత్యాధునిక చికిత్స చేసి, సమస్యను నయం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు.
‘‘ఉప్పర స్వాతి అనే 24 ఏళ్ల యువతి దీర్ఘకాల మూత్రపిండాల సమస్యతో బాధపడుతోంది. ఆమె గతంలో ఏపీ ఫిస్టులా సర్జరీ చేయించుకోగా అది ఫెయిల్ కావడంతో కెథెటర్తో కిమ్స్ సవీరా ఆస్పత్రికి చెందిన నెఫ్రాలజిస్టు డాక్టర్ బద్రీనాథ్ ఆధ్వర్యంలో హీమో డయాలసిస్ చేస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఆమెకు మూత్రపిండాల మార్పిడి చేయాల్సి ఉంది. అంతలో ఆరోగ్య సమస్యలు రావడంతో పరీక్షించగా, శరీరం నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో ఎడమవైపు పైభాగంలో రక్తం గడ్డకట్టినట్లు తెలిసింది. (లెప్ట్ అప్పర్ ఎక్స్ట్రీమిటీ డివిటి) రక్తం కరగడానికి యాంటీ కాగ్యులెంట్ ఇంజెక్షన్లను ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఆమెకు ఆరోగ్యశ్రీ కింద కెథెటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్ చేశాం. తర్వాత మళ్లీ వీనోగ్రామ్ పరీక్షిస్తే, స్టెనోసిస్ సమస్య ఉందని తెలిసింది. అప్పుడు ఆమెకు హైప్రెజర్ బెలూన్తో పెర్క్యుటేనియస్ బెలూన్ వీనోప్లాస్టీ అనే ప్రక్రియ ద్వారా చికిత్స చేశాం. అది విజయవంతం అయ్యింది. దాంతో రోగికి ఇప్పుడు రక్తసరఫరా సాధారణ స్థాయికి చేరుకుంది.