విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామాల్లో లెప్రసీ కేసులపై వచ్చే నెల ఐదో తేదీ వరకు ఆశా వర్కర్లు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపట్టి వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలని న్యూక్లియర్ మెడికల్ డాక్టర్ అన్వర్ బాషా ఆదేశించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన హెల్త్ ఎడ్యుకేటర్ నెహ్రూరెడ్డి, పీఎంఓ రవికుమార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుష్టు వ్యాధికి సంబంధించిన రికార్డులను వెరిఫై చేశారు అనంతరం రాప్తాడులో ఇంటింటా తిరిగి సర్వే చేశారు. ఆశా, వలంటీర్లు సమన్వయంతో ఇంటింటికి వెళ్లి రాగి రంగు మచ్చలు, స్పర్శలేని పొడలను ఆదిలోనే గుర్తించినట్లైతే పేషెంట్కు అంగవైకల్యం లేకుండా కాపాడవచ్చునన్నారు. ఆశావర్కర్లు ఇంటి వద్దకు సర్వేకి వెళ్లినప్పుడు కుటుంబ సభ్యుల వివరాలు సేకరించాల్సి ఉందన్నారు. సర్వేలో వ్యాధితో ఎవరైనా ఉన్నట్లు గుర్తిస్తే ఆ జాబితాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందజేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రావణి సూపర్వైజర్ లక్ష్మీనరసమ్మ, ఏఎన్ఎంలు లీలావతి చంద్రకళ గాయత్రి, లక్ష్మీనరసమ్మ ఉన్నారు.