రూ. 6 లక్షల విలువ చేసే 7 బైకులు స్వాధీనం
విశాలాంధ్ర- రాప్తాడు: మద్యం తాగుడుకు బానిసలై జల్సాలకు అలవాటుపడి చిన్న వయస్సులోనే దొంగలుగా మారిన ఇద్దరిని అరెస్టు చేశామని ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్ గౌడ్, ఎస్ఐ పీవై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం సమీపంలోని మరువకొమ్మ కాలనీకి చెందిన తమ్మిశెట్టి వెంకటరాజేష్ (21), జాకీర్ కొట్టాలకు చెందిన దూదేకుల మహబూబ్ పీరా అలియాస్ దూదేకుల బాబావలి (22) అల్లరిగా తిరుగుతూ దొంగతనాలకు అలవాటు పడ్డారు. రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేసి.. వీరికి కౌన్సిలింగ్ ఇవ్వగా రూ. 6 లక్షల విలువ చేసే 7 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాప్తాడు, అనంతపురం, గార్లదిన్నె పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన మోటార్ సైకిళ్ల దొంగతనాల ఛేదింపుపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఫకీరప్ప ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ జి వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో ఇటుకలపల్లి సిఐ విజయ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో తనతోపాటు కానిస్టేబుళ్లు అంజన్ కుమార్ , దేవ్లానాయక్, ప్రసాద్ లను ప్రత్యేక బృందాలుగా వెళ్లి వాహనాలను ఛేదించామన్నారు. పక్కా సమాచారంతో శనివారం ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా అనంతపురం, గార్లదిన్నె, రాప్తాడు పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. గతేడాది నుంచి నేటి వరకు ఏడు మోటార్ సైకిళ్లను చోరీలు చేయగా వీరిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపామన్నారు.