జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) విద్యార్థులు
విశాలాంధ్ర-రాప్తాడు : విద్యార్థి దశ నుంచే సేవాగుణం అలవరచుకోవాలని జడ్పీటీసీ పసుపుల హేమావతి సూచించారు. ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో భాగంగా హంపాపురం సమీపంలోని ఎస్వీఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు మండలంలోని మరూరు గ్రామంలో గురువారం ఇంటింటా సర్వే నిర్వహించారు. జెడ్పీటీసీ హేమావతి మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల గ్రామాల్లోని మౌలిక వసతులపై అవగాహన కలుగుతుందన్నారు. సమాజంలోని ఆర్థికంగా మరియు సామాజికంగా బలహీన వర్గాల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి గ్రామీణ ప్రాంతాలు పునర్నిర్మాణ కార్యకలాపాల కోసం సమిష్టి కృషి చేయాలన్నారు. మహిళలు తమ స్థితిగతులను మెరుగుపరచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి మౌలిక సదుపాయాలపై ఇంటింటా సర్వే చేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ వీబీఆర్ శర్మ, చైర్మన్ బీవీ క్రిష్ణారెడ్డి, వైస్ చైర్మన్ వెన్నెపూస రవీంద్రరెడ్డి, సీఈఓ ఆనందకుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సూర్యశేఖర రెడ్డి, సర్పంచ్ ప్రభావతి, నారాయణ స్వామి, పసుపుల ఆది, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎం.శ్రీనివాసులు నాయక్, పీడీ ఎం.రమేష్, తదితరులు పాల్గొన్నారు.