విశాలాంధ్ర-రాప్తాడు : క్షయవ్యాధిని 2025నాటికి సమాజం నుంచి సమూలంగా తరిమికొడదామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ ఆభయాన్ కార్యక్రమంలో భాగంగా రాప్తాడు నియోజక వర్గంలోని 40 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు సుమారు రూ.1000 విలువ కలిగిన పౌష్ఠికాహారాన్ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన సొంత నిధులతో అందజేశారు. సోమవారం ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సక్రమంగా మందులతో పాటుగా సరియైన పౌష్ఠికాహారం తీసుకుంటేనే ఈవ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. క్షయవ్యాధి ఉండకూడదనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ పటిష్ట అమలుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం ఉన్న క్షయ వ్యాధిగ్రస్తుల కోసం మందులు, పౌష్టికాహారం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. బలహీనత వల్ల, పౌష్టికాహారం సరిగా తీసుకోకపోవడం వల్ల ఈ వ్యాధి మరింత దాడి చేసే ప్రమాదముందని, రోగ నిరోధకశక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ పేద ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద కనబరుస్తూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని రకాల వ్యాధులను చేర్చి పేదలకు ఎటువంటి ఆర్థిక భారం పడకుండా చూస్తున్నారన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలను, మౌలిక వసతులను సమకూర్చి, వైద్యం కోసం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. అధునాతన క్షయ పరీక్ష చేయడానికి 160 ట్రూనాట్ పరికరాలను కొనేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్, ఏపీ ఎన్జిఓ సంఘం నగర కార్యదర్శి శ్రీధర్బాబు, సిబ్బంది శ్రీనివాసులరెడ్డి, శ్రావణి, మహేష్, నాగమణి, జయవర్దన్, సూరి, శ్రీనివాస్, రేవతి, నిర్మల, వెంకటేష్, సుమన్ పాల్గొన్నారు..