సర్వసభ్య సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు విజ్ఞప్తి
విశాలాంధ్ర`ఉరవకొండ : గ్రామాల్లో కనీస అవసరాలకు కూడా నిధులు కేటాయించకపోతే తాము ప్రజా ప్రతినిధులుగా ఎందుకు ఉండాలంటూ ఉరవకొండ మండలంలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మండల సర్వసభ్య సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం ఎంపీపీ చంద్రమ్మ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించగా ఈ సమావేశంలో వైస్ ఎంపీపీలు నరసింహులు, శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఎంపీటీసీ సభ్యులు వన్నూరు సాహెబ్, షేక్షాన్ పల్లి సర్పంచ్ లింగన్న, ఎంపీటీసీ సభ్యులు రామలింగప్ప మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ గ్రామాల్లో కనీస అవసరాలుకు కూడా నిధులు కేటాయించడం లేదని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నేరమెట్ల సర్పంచ్ యోగేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలో జగనన్న కాలనీలో నీటి సౌకర్యం లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తాగునీరు,విద్యుత్తు వ్యవసాయం వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్న సమస్యలను పలువురు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. హంద్రీనీవా నీటిని ఫిబ్రవరి చివరి వరకు వదలాలని సమావేశం తీర్మానం చేసే ఉన్నతాధికారులకు పంపాలన్నారు. మండల సమావేశానికి అనేక శాఖ అధికారులు గైరహాజర్ కావడంతో వైస్ ఎంపీపీ నరసింహులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమావేశానికి రాని అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీడీవో అమృతరాజ్, మాట్లాడుతూ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్వో బ్రహ్మయ్య, ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు, గౌరవ సభ్యులు, ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.