విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ మండలం మోపిడి ప్రభుత్వ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న సాయి చరణ్ ఈనెల 24 నుంచి 28 వరకు పశ్చిమ బెంగాల్లోనే కలకత్తాలో జరిగే జాతీయస్థాయి ఖో ఖో పోటీలలో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొనడానికి ఎంపికైనట్లు ప్రభుత్వ హై స్కూల్ పిడి ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 9 నుంచి 11 వరకు రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలు నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగాయని ఈ పోటీలలో సాయి చరణ్ అత్యంత ప్రతిభ కనబరచడంతో జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. వారం రోజులు పాటు ప్రకాశం జిల్లా పంగులూరు లో నిర్వహించే కోచింగ్ క్యాంపు లో సాయి చరణ్ పాల్గొంటున్నట్లు తెలిపారు.
సాయి చరణ్ను అభినందించిన గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది
జాతీయస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికైన సాయి చరణ్ ను మోపిడి ప్రభుత్వ హైస్కూల్ సిబ్బంది, గ్రామస్తులు బుధవారం పాఠశాలలో అభినందించారు. సాయి చరణ్ జాతీయ స్థాయిలో జరిగే ఖో ఖో పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు మల్లికార్జున, ప్రభాకర్, విజయ్ నాగరత్న,సువర్ణ, మీనా గ్రామ సర్పంచ్ సిద్ధప్ప, ఉప సర్పంచ్ నీలప్ప, పాఠశాల చైర్మన్ సతీష్ జగన్నాథ్ విద్యార్థులు పాల్గొని అభినందించారు.
వారి కృషి వల్లే జాతీయ స్థాయికి ఎదిగా..
తాను ఖో ఖో క్రీడకు జాతీయ స్థాయికి ఎదగడానికి సౌత్ జోన్ ఖో ఖో అసోసియేషన్ చైర్మన్ పుల్లారెడ్డి, జిల్లా అధ్యక్షులు భీమిరెడ్డి, కార్యదర్శి నిరంజన్ రెడ్డి, పిడి ప్రభాకర్ కృషి వల్ల తాను ఈ స్థాయికి ఎదిగినట్లు సాయి చరణ్ విలేకరులకు తెలిపారు. వారి యొక్క సహాయ సహకారాలు తాను మరువలేనన్నారు.