విశాలాంధ్ర`ఉరవకొండ :ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్లో కేంద్రం మరియు కేరళ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న పేదరిక నిర్మూలన జీవన ప్రమాణాలు పెంపు తదితర అనేక అంశాలపై జరిగే వర్క్షాప్కు ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎం మోనాలిసా ఎంపికయ్యారు. ఈ వర్క్షాప్కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు సర్పంచులను ఎంపిక చేసినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరొకరు కాకినాడ ప్రాంతానికి చెందిన ఏధితా గ్రామ సర్పంచ్ బి. ఆశీర్వాదం ఎంపికయ్యారు. ఈ వర్క్షాప్లో పేదరిక నిర్మూలనకు కేంద్రము మరియు వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించడమే కాకుండా భవిష్యత్తులో పేదరిక నిర్మూలనకు తీసుకోవలసిన నిర్ణయాలపై కూడా చర్చ జరుగుతున్నట్లు పంచాయతీ కమిషనర్ విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా మాట్లాడుతూ, తనను జాతీయ వర్క్ షాప్ కు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు వర్క్ షాప్ లో చర్చించే అనేక అంశాలపై అవగాహన పెంచుకొని గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.