విశాలాంధ్ర.. ధర్మవరం : రాష్ట్ర టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు పట్టణ టిడిపి నాయకులు శనివారం వివిధ వార్డుల్లో పర్యటించినప్పుడు, వార్డు ప్రజల నుండి విశేష స్పందన రావడం జరిగిందని టిడిపి నాయకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పట్టణంలో 30,14, 37 వార్డులలో టిడిపి నాయకులు కమతం కాటమయ్య, పని కుమార్, పరిసే సుధాకర్, బోయ రవిచంద్ర, నాగుర్ హుస్సేన్, మారుతి స్వామి తోపాటు పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో వెళ్లారు. వార్డుల్లో ప్రజల ద్వారా వచ్చిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను కరపత్రాల ద్వారా వార్డు ప్రజలకు వాస్తవాలను తెలియజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్ర ప్రజలు పూర్తిగా మోసం మోసపోవడంతో పాటు రాష్ట్ర ఖజానా కూడా ఖాళీ కావడం, రాష్ట్రాభివృద్ధి జరగలేకపోవడం దారుణమన్నారు. చేనేతలకు పేరుగాంచిన ధర్మవరం లాంటి చేనేత నగరాలలో చేనేత కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. టిడిపి హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వారు ప్రజలకు వివరిస్తూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశామని తెలిపారు. మైనారిటీలకు, ముస్లింలకు దుల్హన్ పథకాన్ని నేటి ప్రభుత్వం తొలగించి అన్యాయం చేసిందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం వాటిని తప్పక అమలు చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తొగట అనిల్, కృష్ణాపురం జమీర్ అహ్మద్, అత్తర్ రహీం, రాయపాటి శివ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.