ఏపీ రైతు సంఘం డిమాండ్
విశాలాంధ్ర`ఉరవకొండ : ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు మిరప సాగు చేస్తే వైరస్ సోకి పంట మొత్తం దెబ్బతిన్నదని మిరప పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని సిపిఐ పార్టీ అనుబంధ ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్, ఉరవకొండ నియోజకవర్గం రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం బెలుగుప్ప మండలం శిర్పి గ్రామంలో వైరస్ సోకి మిర్చి పంటను తొలగించిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట చేతికొచ్చే సమయంలో పంటకు వైరస్ సోకడం పంటను మొత్తం తొలగించడం బాధాకరమైన విషయం అన్నారు. ఇదే గ్రామంలో దాదాపు 80 మంది కౌలు రైతులు కూడా మిర్చి పంటను సాగు చేసి తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతులు ఇంత పెద్ద ఎత్తున నష్టపోయినప్పటికీ వ్యవసాయ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గాని రైతుల యొక్క బాధలను కష్టాలను తెలుసుకోవడానికి రాకపోవడం శోచనీయమన్నారు. మిర్చి పంటకు సోకిన వైరస్ ని గుర్తించి పంటలను కాపాడాల్సిన శాస్త్రవేత్తలు కూడా పొలాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఉరవకొండ నియోజకవర్గం లో విడపనకల్లు, వజ్రకరూరు ఉరవకొండ మండలంలో కూడా అనేక మంది రైతులు వైరస్ సోకిన మిర్చి పంటను తొలగించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా పరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరుతూ ఈనెల 12వ తేదీన అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ మరియు ఏపీ రైతు సంఘం సంయుక్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ నిరసన తెలిపారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కుళ్లాయప్ప రాజేష్ తో పాటు రైతులు పాల్గొన్నారు
మిరప పొలాలను మంత్రి పరిశీలించాలి
ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలంలో మిర్చి పంటలు నష్టపోయిన రైతు పొలాలను జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించి నష్టపోయిన రైతులు ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. శనివారం మంత్రి ఉరవకొండ కు వస్తున్న దృష్ట్యా రైతు సమస్యలను కూడా తెలుసుకొని వారిని ఆదుకోవాలని కోరారు