Friday, April 19, 2024
Friday, April 19, 2024

నాణ్యమైన వేరుశెనగ విత్తనాలను పక్కా పంపిణీ చేయాలి…

గ్రామ ప్రజల రోగులకు నాణ్యమైన వైద్యమును అందించాలి.. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
విశాలాంధ్ర- ధర్మవరం : నాణ్యమైన వేరుశెనగ విత్తనాలను పక్కాగా పంపిణీ చేయాలని, ఆ విత్తనాలతో రైతుల యొక్క పంటలు అధిక దిగుబడి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారు ఆకస్మికంగా పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు లోగల వేరుశనగ విత్తన శుద్ధి కేంద్రాన్ని, మండల పరిధిలోని దర్శనమల రైతు భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత కలెక్టర్ ఆర్డిఓ కార్యాలయమునకు చేరుకొని, ఆర్డిఓ తిప్పే నాయక్ తో డివిజన్ పరిధిలోని పలు సమస్యల పై చర్చించారు. డివిజన్ ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేలా కృషి చేయాలని వారు సూచించారు. తదుపరి విత్తన శుద్ధి కేంద్రంలోని వేరుశనగ విత్తనాలను వారు స్వయంగా పరిశీలించారు. విత్తన శుద్ధికి ముందు, శుద్ధి తర్వాత తూకం వేసి వారు పరిశీలించారు. రైతులకు పంపిణీ చేసే వేరుశెనగ బ్యాగులలో ఎటువంటి తూకంలో తేడాలు ఉండరాదని సూచించారు. విత్తన శుద్ధి తర్వాత రైతుకు అందించే ప్రతి వేరుశెనగ బ్యాగు యొక్క బరువు 30 కేజీల 300 గ్రాములు విధిగా ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈనెల 29వ తేదీన జిల్లాలోని రైతులందరికీ కూడా వేరుశెనగ విత్తన పంపిణీని రైతు భరోసా కేంద్రాలలో తప్పక సకాలములో అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వైవి సుబ్బారావుకు తెలిపారు. ధర్మవరంలో 4,200 క్వింటాళ్లు టార్గెట్ కు గాను ప్రస్తుతం 900 క్వింటాలు మాత్రమే సిద్ధమయ్యాయని, మిగతా బ్యాలెన్స్ను తొందరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. తదుపరి విత్తన కేంద్రంలో వేరుశనగ మొలకలు యొక్క పద్ధతిని వారు పరిశీలించారు. ధర్మవరం డివిజన్ పరిధిలోని 71 ఆర్.బి.కె కేంద్రాలకు సకాలంలో వేరుశెనగ బ్యాగులను పంపేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులకు వేరుశనగ విత్తనాలు నాణ్యతగా ఉండేలా చూడాలని, ఆ బాధ్యత ప్రతి అధికారిదినని వారు సూచించారు. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు దొరలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రైతుకు ఒక వేరుశెనగ బ్యాగు రూ.1,674 లతో అందించాలని తెలిపారు. తదుపరి గిడ్డంగిలో గల వేరుశనగ బస్తాల యొక్క స్టాకు నిల్వ రిజిస్టర్ను కూడా వారు తనిఖీ చేశారు. వేరుశెనగ విత్తన పంపిణీకి సమయం తక్కువ ఉన్నందున సకాలంలో బస్తాలను పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామ ప్రజలకు నాణ్యత గల వైద్యాన్ని అందించాలి… జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
మండల పరిధిలోని దర్శనమల పీహెచ్సీ వైద్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దర్శనమల ప్రజలకు వైద్య సేవలు ఏమేమి అందిస్తున్నారు? అన్న వివరాలను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత ద్వారా అడిగి తెలుసుకున్నారు. రోగులు నిరీక్షించు గది, రక్త పరీక్ష కేంద్రము, లేబర్ రూములను, మందు నిల్వ గది లను వారు పరిశీలించారు. ప్రతిరోజు ఓపి ఎంతవరకు వస్తుంది? ఈహెచ్సిలో చేసే వైద్య సేవలు ఏంటి? ఉన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో మెడికల్ ఆఫీసర్ పుష్పలత ప్రతిరోజు 50-70 వరకు రోగులు వస్తున్నారని, జబ్బుకు తగ్గ మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తదుపరి కలెక్టర్ ఇక్కడ పాము కాటుకు కుక్క కాటుకు మందులు ఉన్నాయా? లేదా? అన్న వాటిని అడిగారు. తదుపరి సమాధానం రోగులకు తగ్గ మందులతో పాటు పాము కాటు, కుక్క కాటుకు కూడా ఇంజక్షన్లు మందులు ఉన్నాయని వైద్యులు తెలిపారు. అదేవిధంగా మహిళ ప్రసవాలు జరుగుతున్నాయా? లేదా? అని అడిగారు. స్పందించిన వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రసవాలు జరగడం లేదని, ఇకనుంచి ప్రారంభిస్తామని తెలిపారు. రోగుల ద్వారా ఎటువంటి ఫిర్యాదులు అందకుండా చక్కటి వైద్యాన్ని అందించే బాధ్యత వైద్యులది, సిబ్బంది దేనని తెలిపారు. రక్త పరీక్షలు కూడా సక్రమంగా, నాణ్యతగా చేయాలని సూచించారు. రోగ నివారణలో అందరూ మంచి వైద్యాన్ని అందించినప్పుడే పీహెచ్సీకి మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తిప్పే నాయక్ , డి ఎం అండ్ హెచ్ ఓ.. కృష్ణారెడ్డి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ.. సెల్వియా సాల్మన్, జిల్లా వ్యవసాయ అధికారి వై వి సుబ్బారావు, మెడికల్ ఆఫీసర్ పుష్పలత, ఎమ్మార్వో యు గేశ్వరి దేవి, ధర్మవరం డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణయ్య, ఏపీ సీడ్స్ మేనేజర్ ధనలక్ష్మి, వ్యవసాయ అధికారి చెన్న వీరస్వామి, ఎంపీడీవో మమతా దేవి, పి.హెచ్.సి సూపర్వైజర్లు జయకుమారి, కామేశ్వరి, హెల్త్ అసిస్టెంట్ ఆంజనేయులు, గ్రామ వ్యవసాయ అధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img