మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్
విశాలాంధ్ర-ఉరవకొండ : వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణిస్తే చర్యలు తప్పవని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె విఎల్ఎన్ ప్రసాద్ అన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా గురువారం ఉరవకొండ పట్టణంలో రవాణా శాఖ, మరియు ఆర్టిసి అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. బళ్లారి- అనంతపురం రహదారిపై ప్రయాణించే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నామని పేర్కొన్నారు. వాహనదారులందరూ తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండడంతో పాటు నిబంధనల ప్రకారమే ప్రయాణికులను తరలించాలని సూచించారు. ఈ సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్, మరియు ఫిట్నెస్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ నంబర్లు.లేని వాహనదారులకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇన్సూరెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా ప్రయాణికులు కూడా జాగ్రత్తలు పాటించాలని సురక్షితమైన వాహనాలలోనే ప్రయాణం చేయాలని ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.