జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గౌతం కుమార్
విశాలాంధ్ర`ఉరవకొండ : నిత్యం పేద ప్రజల సమస్యల పైన వారికి జరుగుతున్న అన్యాయాల పైన అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్న జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ని విమర్శించే అర్హత ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డికి లేదని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గౌతం కుమార్ అన్నారు. మంగళవారం ఉరవకొండ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉరవకొండ పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పేద ప్రజలకి ఇల్లు నిర్మించుకోవడానికి అనువైన ప్రదేశంలో స్థలాలు ఇవ్వకుండా వైసిపి నాయకుల యొక్క భూములు ఎక్కడ ఉన్నాయో వాటిని మాత్రమే కొనుగోలు చేయించి వైసీపీ నాయకులు లబ్ధి పొందారన్నారు. ఇల్లు నిర్మించుకోవడానికి అనువైన ప్రాంతం కానప్పుడు అ ప్రాంతంలో ఇల్లు ఏ విధంగా నిర్మించుకుంటారో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి తెలపాలన్నారు. పేద ప్రజలకు తామే ఇండ్లను నిర్మించి ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందన్నారు నియోజకవర్గంలో కేవలం 10 శాతం కూడా ఇల్లు నిర్మాణం జరగలేదని ఆరోపించారు. అనేకమంది లబ్ధిదారులు సిమెంటు,ఇసుక,బిల్లులు అందడం లేదని ఆరోపిస్తున్నారని మరి కొంతమంది లబ్ధిదారులు జగనన్న కాలనీలో విద్యుత్తు నీరు, రోడ్లు లేకపోతే ఇల్లు ఏ విధంగా నిర్మించుకుంటామని ప్రశ్నిస్తున్నారని ఇవన్నీ వైసిపి నాయకులకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని విమర్శించడం మాని పేద ప్రజల యొక్క అభివృద్ధి పై దృష్టి సారించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ విడపనకల్ల అధ్యక్షుడు తలారి గోపాల్, కేశవ,సుధీర్ వజ్రకరూరు మండల అధ్యక్షులు కేశవ అంచనాల, నాయకులు దేవేంద్ర,రాజేష్ అబ్దుల్,రాంబాబు,రాజు, రమేష్, ముని కుమార్ రమేష్ సురేష్,జగదీష్ తదితరులు పాల్గొన్నారు