వైద్యులు పర్యవేక్షణలోనే యాంటీబయటిక్ మందులు తీసుకోవాలి
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి విశ్వనాథయ్య
విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : సొంతంగా తమ ఆరోగ్యం పట్ల యాంటీబయటిక్ మందులు తీసుకోకుండా వైద్య నిపుణుల సలహా మేరకు యాంటీబయటిక్ మందులు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విశ్వనాథయ్య పేర్కొన్నారు. బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ప్రపంచ యాంటీ మైక్రోబయల్ అవగాహన ర్యాలీ ని డి ఎం అండ్ హెచ్ ఓ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ఆదేశాల మేరకు నవంబర్ 18 నుంచి 24వ తేదీ వరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం యాంటీ మైక్రో బయల్ రెసిస్టెన్సీ టుగెదర్ నిరోధించాలి అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్నిచేపడుతున్నామన్నారు. వారం రోజులు ఏఎంఆర్ ని పూర్తిగా ఏ ఎం ఆర్ ని పరిష్కరించే దిశగా దృష్టి కేంద్రీకరించబడుతుందన్నారు. వన్ హెల్త్ విధానం ద్వారా మరోసారి సమిష్టిగా పనిచేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధమైందని పేర్కొన్నారు. వారం రోజులపాటు అన్ని పి హెచ్ సి, యూ పి హెచ్ సి లలో, 104 కార్యక్రమం నిర్వహించే అన్ని గ్రామాలలో అక్కడి ప్రజలకు వైద్యాధికారులు అవగాహన కల్పిస్తారు అన్నారు. జనరల్ ఫిజీషియన్ విభాగాధిపతి భీంసేన్ ఆచారి మాట్లాడుతూ… ప్రజల్లో యాంటీబయాటిక్ మందు సంజీవిని ఔషధం అనే అపోహ నెలకొన్నదని ఒళ్ళు నొప్పులు ఇలా చిన్నచిన్న రుగ్మతలకు యాంటీబయటిక్ వైద్యులు సూచన లేకుండా వేసుకోరాదన్నారు. ఈ కార్యక్రమంలో డి ఐ ఓ యుగంధర్, జిల్లా ప్రోగ్రామ్ అధికారులు, కార్యాలయ విభాగ పరిపాలన అధికారులు తదితరులు పాల్గొన్నారు.