విశాలాంధ్ర-రాప్తాడు : విద్యార్థులు భవిష్యత్లో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కరస్పాండెంట్ వీబీఆర్ శర్మ సూచించారు. హంపాపురం సమీపంలోని ఎస్వీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఛైర్మన్ బీవీ కృష్ణారెడ్డి, వైస్ ఛైర్మన్ రవీంద్రరెడ్డి, హాజరయ్యారు. ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రాణాలు కాపాడే రక్తం జీవన వాహిని అన్నారు. శరీర అవయవంలోని ప్రతి కణజాలానికి రక్తం రక్షణ ఇస్తుందన్నారు. అటువంటి విలువైన రక్తగ్రూపు ఏంటో తెలుసుకోవడం చాలా అవసరమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తమకు రక్తం ఎక్కించాలన్నా, ఇతరులకు రక్తదానం చేయాలన్నా రక్త గ్రూపు అవసరమన్నారు. ఈ క్యాంపులో దాదాపు 400 మందికి రక్తగ్రూపు నిర్ధారణ చేశామన్నారు. వారం రోజుల ఈ క్యాంపులో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హంపాపురం గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా మొక్కలు నాటడంతోపాటు ప్రజల ఆరోగ్యం బాగుండేలా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీఈఓ ఆనంద్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సూర్యశేఖరరెడ్డి, మానవతా రక్తదాన ఉద్యమ నిర్మాత తరిమెల అమర్నాథరెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎం.శ్రీనివాసులునాయక్, పీడీ రమేష్ తదితరులు ఉన్నారు.