నూతన జాతీయ విద్యా విధానం అమలుకు కుట్ర…
: ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య,డివిజన్ అధ్యక్షుడు శివ
విశాలాంధ్ర` ధర్మవరం : భారతదేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషించడం కోసమే నూతన జాతీయ విద్యా విధానం అమలకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని శ్రీ సత్య సాయి జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య, డివిజన్ అధ్యక్షుడు శివ లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుద్యోగులను నట్టేట ముంచిన మోడీ ప్రభుత్వానికి త్వరలో పతనం తప్పదని హెచ్చరించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని,ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. అందుకే ఈనెల 25న చలో ఢల్లీి పార్లమెంటు మార్చుకు, విద్యార్థులు అందరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెట్టి, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడానికి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్మి వేసే కుట్ర చేస్తోందని తెలిపారు. మన రాష్ట్రంలో 10 జాతీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తున్న చేస్తామన్న హామీ ఏమైంది? అని, విద్యారంగాన్ని నాశనం చేసేందుకు విద్యా ప్రైవేటీ కరణ, విద్య కాసాయి కరణ చేయడానికి ఆగమేఘాల మీద 2020 నూతన జాతీయ విధానాన్ని తీసుకురావడం దాన్ని ఖండిస్తూ ఉన్నామని, వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మనదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు గుణ, మురళి ,గణేష్, కిషోర్, విష్ణు, రాజేష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.