విశాలాంధ్ర-రాప్తాడు : మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎస్కేయూలో కేక్ కట్ చేసిన అనంతరం వీసీ రామకృష్ణారెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో జనాల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోనున్నారని కొనియాడారు. మొక్కల పెంపకం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం పరీక్ష భవన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదేవిధంగా రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా యువత రక్తదానం చేసేందుకు భారీగా తరలివచ్చారు. ముందుగా భారీ కేక్ ను ఎమ్మెల్యే కట్ చేశారు. అనంతరం రాప్తాడు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్యాబ్ లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి, ఎంపీడీఓ సాల్మన్, కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి, మరూరు ఆది, కేజేబీవీ ఎస్ఓ ముత్యాలమ్మ, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.