విశాలాంధ్ర-రాప్తాడు : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు గ్రామీణ విద్యార్థి పసుపుల ప్రకాష్. తిరుపతి జిల్లా రేణిగుంట ఉన్నత పాఠశాలలో ఈనెల 18వ తేదీన జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించాడు. రాప్తాడు మండలం ఎం.చెర్లోప్లల్లి గ్రామానికి చెందిన పసుపుల వీరనారప్ప, మల్లిక దంపతులు వ్యవసాయంతోపాటు గొర్రెలను పోషించుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులుండగా పెద్దబ్బాయి ప్రవీణ్ పాలిటెక్నిక్ చదువుతుండగా, చిన్నబ్బాయి ప్రకాష్ కొనకొండ్ల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఆటలపై ఆసక్తి ఉన్న ప్రకాష్ లాంగ్ జంప్, రన్నింగ్ ఉత్తమ ప్రతిభ కనబరచి సిల్వర్, రజత పతకాలు సాధించారు. ఈ ఆటలతోపాటు రెజ్లింగ్ లో ఆడాలని ఉత్సాహంగా ఉండేవాడు. ప్రకాష్ ఆటతీరును, చురుకుదనాన్ని, శారీరక దారుఢ్యాన్ని గమనించిన పాఠశాల పీఈటీ దాసరి నరసింహులు ఏడాది నుంచి రెజ్లింగ్ పోటీల్లో మెళకువలతోపాటు శిక్షణ ఇచ్చారు. ఇటీవల తిరుపతి జిల్లా రేణిగుంటలో ఈనెల 18వ తేదీన జరిగిన 66వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ప్రత్యర్ధులను మట్టి కరిపించి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో నిర్వాహకులు పసుపుల ప్రకాష్ కు గోల్డ్ మెడల్ సాధించారు. గతంలో కూడా రెండుసార్లు జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ ను సాధించాడు.రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడంపై భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఎం.చెర్లోప్లల్లి గ్రామస్తులు అభినందించారు.