విశాలాంధ్ర-రాప్తాడు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పి రైతులకు నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈనెల12వ తేదీన అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ రాప్తాడు మండల కార్యదర్శి ఆర్ రవీంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం జీపుజాతా ప్రచారాన్ని ప్రారంభించారు. రామకృష్ణ మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర, రైతుల రుణమాఫీ, విద్యుత్ మీటర్ల రద్దు, పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల విధానాలతో వ్యవసాయం భారంగా మారిందన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారణ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, గ్రామాల్లో వలసలను నివారిస్తామని చెప్పిన అనేక హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందని, ప్రతి రైతుపై రూ. 2 లక్షల అప్పులు భారాన్ని మోస్తున్నారని వ్యవసాయం ఆర్థిక నిపుణుల వెల్లడిరచారన్నారు. దేశంలో ప్రతి గంటకు రైతు ఆత్మహత్యకు గురువుతున్నారని డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు చేస్తే వాటిని బుట్టదాఖలు చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ నల్ల చట్టాలను విద్యుత్ సంస్కరణ బిల్లును తీసుకురావడం వల్ల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడే పరిస్థితి వచ్చిందన్నారు.
ప్రతి రైతు ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చలపతి, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.