విశాలాంధ్ర -ధర్మవరం : నేటి వైసిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రైతులకు రైతు భరోసా పేరుతో అన్యాయమే చేసిందని, రైతుల అభివృద్ధికి పాటుపడలేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి శనివారం తన స్వగృహంలో విలేకరులతో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శుక్రవారం రోజు రైతు దినోత్సవ సందర్భంగా ముదిగుబ్బ మండలంలో తాను పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. గతంలో రైతులకు రాయలసీమ జిల్లాలలో వేరుశెనగ కానీ, ఇతర పంటలు నష్ట పోయిన వాళ్లకు ఇంతవరకు సబ్సిడీ ప్రకటించిన పాపాన పోలేదని ,ప్రభుత్వం పై మండిపడ్డారు. అలాగే గత ప్రభుత్వాలు బ్యాంకులో లోన్ తీసుకుంటే నేరుగా బ్యాంకు ఖాతాలోకి నష్టపరిహారం పడేదని, కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల పెట్టి, కేవలం వాళ్ల కార్యకర్తలకు మాత్రమే పంట నష్టపరిహారం ను రాపించుకొని, రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ పడే విధంగా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా రైతు భరోసా పేరుతో 13వేల రూపాయలు అని చెప్పి కేవలం 7500 మాత్రమే అది కూడా రు. 2000 ఒకసారి 5000రూ .ఒకసారి రైతులకు బిక్షం వేసినట్లు వేస్తున్నారని ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. మా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పూర్తి దశలో న్యాయం చేకూర్చుతామని వారు తెలిపారు.