విశాలాంధ్ర-రాప్తాడు : గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నేరమని హెల్త్ సూపరవైజర్ లక్ష్మీనరసమ్మ తెలిపారు. సోమవారం రాప్తాడు గ్రామంలో లింగనిర్ధారణ చట్టం అవశ్యకత గురించి, ఆ చట్టం ప్రకారం గ్రామాలలో కమిటీల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు ఎక్కడ కూడా లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకోకుండా చూసే బాధ్యత గ్రామ కమిటీలపై ఉందన్నారు. గ్రామ కమిటీలో సర్పంచ్, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా సభ్యులు ఉంటారన్నారు. మండల కమిటీలో మండల తహశీల్దారు, పీహెచ్సీ డాక్టర్, ఎస్హెచ్ఓ, ఐసిడిఎస్ సూపర్ వైజర్ లేదా సీడీపీఓ, ఆయా ఏరియా మహిళా పోలీస్లు సభ్యులుగా ఉంటారన్నారు. మండల స్థాయి కమిటీలు ప్రతి నెలా రిపోర్టును డివిజన్ స్థాయి కమిటీకి సమర్పించాల్సి ఉంటుందన్నారు. యుక్త వయసు రాకుండానే 18 ఏళ్ళలోపు ఉన్నవారికి వివాహం చేయకూడదన్నారు. బాల్య వివాహాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడంతోపాటు వారికీ పరిపక్వత లేక బిడ్డను పోషించలేరన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాకే తిరుపాలు, హెల్త్ సూపర్వైజర్ లక్ష్మీనరసమ్మ, ఏఎన్ఎం లీలావతి, ఆశా కార్యకర్తలు చంద్రకళ, గాయత్రి పాల్గొన్నారు.