ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి
విశాలాంధ్ర`ఉరవకొండ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి అన్నారు. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం కొనకొండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లాస్థాయి అండర్ 14 క్రికెట్ జట్లు ఎంపిక పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ క్రీడలు మానసిక మరియు శారిరక్ ఉల్లాసానికే కాకుండా పిల్లల ఎదుగుదలకు ఉపయోగ పడతాయని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారికి ఆసక్తిఉన్న క్రీడలను గుర్తించి వారికి అందులో తగు శిక్షణ ఇచ్చినట్లయితే వారు భవిష్యత్తులో దేశవాళీ పోటీలలో కూడా పాల్గొని మంచి పేరు తెచ్చుకోవచ్చని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రికెట్ పోటీలలో రాణించాలని సచిన్ టెండుల్కర్ లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తమ గ్రామంలో ఉన్న పాఠశాల యందు క్రీడా మైదానం కోసమే దాదాపు 10 ఎకరములు స్థలాన్ని కేటాయించడం జరిగిందని. ఇక్కడ అనేక జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు తరచూ జరుగుతుంటాయని తెలిపారు. తమ గ్రామంలో చాల మంది క్రికెట్ మరియు ఫుట్ బాల్ లో రాణించి దేశస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన తెలియజేశారు. తరువాత ఆయన కాసేపు బ్యాటు పట్టి పిల్లలతో కలసి క్రికెట్ ఆడి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమము ఆర్గనైజర్ పి. సత్యనారాయణ, ఫిజికల్ డైరెక్టర్లు, వైయస్.ఆర్.సిపి నాయకులు కాకర్ల నాగేశ్వరరాపు, సత్యసాయి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు అంజన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు,పాఠశాల కమిటీ చైర్మేన్ రామాంజినేయులు, వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్, సంపత్, దత్తు, రాజ్యలక్ష్మి మరియు విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.