విశాలాంధ్ర- కళ్యాణదుర్గం : వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి షాక్ తగలడంతో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం డి. చెన్నేపల్లి లో జరిగిన ఈ సంఘటన గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. డి చెన్నేపల్లి కి చెందిన బొమ్మన్న గురువారం ఉదయం వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి షాక్ తగిలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అపస్మారకస్థితిలో పడిన బొమ్మన్న ను వైద్య చికిత్స కోసం కళ్యాణదుర్గం తరలించారు. సంఘటన జరిగిన వెంటనే 108కు సమాచారం ఇచ్చినప్పటికీ సకాలంలో స్పందించలేదని నూతిమడుగు నుంచి బాడుగ ఆటోలో కళ్యాణదుర్గం తీసుకువచ్చే లోపే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.. సకాలంలో వైద్యం అంది ఉంటే బొమ్మన్న బతికి ఉండేవాడని కన్నీరుగా విలపించారు. కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన బొమ్మన్నకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.