భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు దిక్సూచి
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ మైరెడ్డి నీరజ
విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : జాతీయ రాజ్యాంగ దినోత్సవంను స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో సెంట్రల్ హాలులో ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ మైరెడ్డి నీరజ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ డాక్టర్ మైరెడ్డి నీరజ మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాత్రుత్వం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను, వాటిని సక్రమమైన మార్గంలో ఉపయోగించుకొని సంతోషంగా జీవితాన్ని గడపాలని వైద్య విద్యార్థుల నిర్దేశించి ప్రసంగించారు. భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సామరస్యము మన దేశానికి ప్రత్యేకతలని వాటిని ఎల్లప్పుడూ పెంపొందించుకునేలా మానవ సంబంధాలనుమెరుగుపరుచుకోవాలన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగానికి లోబడే జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుందని, అతిక్రమిస్తే న్యాయ చట్టపరమైన చర్యలు తప్పవని కావున విద్యార్థులు మంచి నడవడిక, సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, తన బృందం కలిసి రచించిన ఈ అద్భుతమైన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు మార్గదర్శకమని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ వైద్య ఉపాధ్యాయులతో, ప్రిన్సిపాల్ ఆఫీసు సిబ్బంది, ఉపాధ్యాయేతర సిబ్బందితో రాజ్యాంగ హక్కులను పాటిస్తామని ప్రమాణాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి, ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం, ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ నాగ రత్నమ్మ, ఆఫీసు సూపరింటెండెంట్ రవికుమార్, డాక్టర్లు శివ శంకర్ నాయక్, హైమావతి, భవాని, సుశీల కుమారి, మీనిగ శైలజ, రత్న హారిక, దీప్తి, శ్రీనివాస్, చంద్రశేఖర్, సునీల్ కుమార్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ అబ్దుల్ మజీద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, ప్రధమ ద్వితీయ సంవత్సర వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.