విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని ఆర్డిటి కాలనీ, సజ్జలదిన్నె, ఎర్రగుంటపల్లి గ్రామాల వద్ద నిర్మిస్తున్న జగనన్న గృహ నిర్మాణాలను శనివారము జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జగనన్న ఇళ్లను సందర్శించి పరిశీలించము. లక్షల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను జగనన్న కాలనీల పేరుతో పేదలకు పంచిపెట్టారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణం జరగలేదని నిర్మించిన కొన్ని ఇల్లు కూడా పునాదుల దగ్గరే ఆగిపోయా యని తెలిపారు. ఆ పునాదులన్నీ కేవలం ఒక అడుగు లెంటెల్ ఉపయోగించి భూమికి పైభాగాన నిర్మించారని, ఆ లెంటల్లపై నిర్మించే గోడలు ఎంత మాత్రం ధృడంగా ఉంటాయో చెప్పలేమని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్నా జగనన్న కాలనీలలో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుందని ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేయడంలో ఓ భాగమని పేర్కొన్నారు. లబ్ధిదారులు సొంత డబ్బుతోనే ఇళ్లను నిర్మించుకుంటున్నామని ప్రభుత్వం నుంచి కేవలం లక్ష 80 వేల రూపాయలు మాత్రమే మంజూరైయింది. పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మాణం కొరకు 6 నుండి 8 లక్షల ఖర్చు అవుతుందన్నారు. జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు కార్యక్రమం పేరుతో ప్రభుత్వం చేస్తున్న మోసాలను అవినీతిని జనసేన పార్టీ ప్రజలకు తెలియజేస్తామన్నారు.ఈ కార్య క్రమంలో నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, పట్టణ అధ్యక్షులు నరసింహచారి, యాడికి మండల ఇంచార్జ్ సునీల్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు గోపాల్, పెద్దవడుగురు నాయకులు దూద్ వలి పట్టణ ప్రధాన కార్యదర్శులు కొండాశివ, మణికంఠ, రసూల్, జనశైనికులు జాకీర్ హుస్సేన్, గుండ్లశివ, నాగర్జున పాల్గొన్నారు.